
జైపూర్: టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అజారుద్దీన్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్లోని సూర్వాల్లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి అజ్జూ స్పల్ప గాయాలతో బయటపడగా.. ఆయన కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. అయితే ప్రమాదంలో కారు మాత్రం తీవ్రంగా ధ్వంసమైంది.
న్యూ ఇయర్ వేడుకల కోసం మహ్మద్ అజారుద్దీన్ తన కుటుంబసభ్యులతో కలిసి రాజస్తాన్ పర్యటనకు వెళ్లాడు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న అజ్జూ కుటుంబసభ్యులు రణతంబోర్ పార్క్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. వారు ప్రయాణిస్తున్న కారు లాల్సట్-కోటా హైవేపై ప్రమాదానికి గురైంది. టైరు పేలడం వల్ల అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి.. పక్కనే ఉన్న ధాబాలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. సుర్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కారు ప్రమాదంలో మహ్మద్ అజారుద్దీన్కు స్పల్ప గాయాలు అయ్యాయి. ఆయన కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అజర్తో పాటు ఆయన కుటుంబసభ్యులను మరో వాహనంలో ఆయన బస చేస్తున్న హోటల్కు తరలించినట్లు సమాచారం తెలుస్తోంది. ధాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
అంతర్జాతీయ కెరీర్లో మహ్మద్ అజారుద్దీన్ 99 టెస్టుల్లో, 334 వన్డే మ్యాచ్ల్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 6215 పరుగులు, వన్డేల్లో 9378 రన్స్ బాదాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 29 సెంచరీలు బాదాడు. అజహరుద్దీన్ భారత టెస్టు జట్టులోకి 21 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసాడు. ఆడిన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే ఉంది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. 2000లో ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. భారత సారథిగా 174 వన్డేల్లో, 47 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు.