టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రానున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అజార్ ను అనర్హుడిగా నిర్ణయిస్తూ మాజీ సుప్రీం కోర్టు జడ్జి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ శుక్రవారం ప్రకటించింది. బోర్డు రూల్స్ ని అతిక్రమించినందుకే ఆయనను అనర్హుడిగా ప్రకటించినట్లు వెల్లడించింది.
2019 సెప్టెంబర్లో జరిగిన హెచ్ సీ ఏ అధ్యక్ష ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపొందారు. అప్పటినుంచి ఏడాది కాలంపాటు అజారుద్దీన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పదవీకాలం పూర్తయినా సుప్రీం కోర్టు కొత్తగా సింగిల్ మెంబర్ ప్యానెల్ ను నియమించే వరకు ఆయనే ఆ పదవిలో కొనసాగారు.

ఇక తాజాగా ఈ నెలలో హెచ్ సీ ఏ అధ్యక్ష ఎన్నికలు జరగబోతుండగా.. అజార్ ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో హెచ్ సీ ఏ కార్యకలాపాలు చూసుకోవడం కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలోనే జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అజార్ ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హునిగా ప్రకటించడమే కాకుండా ఆయన ఓటు హక్కును కూడా తొలగిస్తున్నట్లు 2023, జూలై 31న సంచలన ప్రకటన చేసింది.
అజార్ అనర్హతకు సంబంధించి జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ వెలువరించిన ప్రకటనలో ఏముందంటే.. "ఏ క్లబ్ లో అయినా ఎక్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్న వ్యక్తి లేదా ఆ వ్యక్తి కుటుంబీకులు ఎవరైనా ఇతర క్లబ్బుల మేనేజ్ మెంట్ లో మెంబర్స్ గా ఉంటే సదరు వ్యక్తి సభ్యత్వంతో పాటు అతడి ఓటు హక్కు 3 ఏళ్ల పాటు లేదా తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అధికారాన్ని కోల్పోతారు. అజారుద్దీన్ విషయంలో అదే జరిగిందని కమిటీ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొనడం జరిగింది.
ఆ రిపోర్ట్ ప్రకారం.. సుప్రీం కోర్టు నియమించిన సూపర్ వైజరీ కమిటీ 2022, సెప్టెంబర్ 30న అప్పటి అధ్యక్షుడు అజారుద్దీన్ ను హెచ్ సీ ఏ ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని క్రికెట్ క్లబ్ ల వివరాలు సేకరించి ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 10న డెక్కన్ బ్లూ క్రికెట్ క్లబ్ నుంచి ఆ క్లబ్ సెక్రటరీ మాన్ సింగ్ ద్వారా రిపోర్ట్ అందింది. అందులో అజారుద్దీన్ ను క్లబ్ అధ్యక్షునిగా పేర్కొన్నారు. దీని ఆధారంగా రూల్స్ అతిక్రమించి ఒకటికంటే ఎక్కువ క్లబ్ లకు అధ్యక్షుడిగా ఉన్నందున ఆయనను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించడం జరిగిందని కమిటీ పేర్కొంది.
ఇదిలా ఉంటే హెచ్ సీ ఏ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 20న జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు జరగబోతున్నాయి.