
కేరళ: దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ముంబైతో తలపడిన మ్యాచ్లో కేరళ బ్యాట్స్మన్ మహ్మద్ అజహరుద్దీన్ (137 నాటౌట్; 54 బంతుల్లో 9x4, 11x6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసి.. భారత్ తరఫున పొట్టి క్రికెట్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. కేరళ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు. అంతేకాకుండా ముస్తాక్ అలీ టోర్నీలో ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. దీంతో అజహరుద్దీన్ బ్యాటింగ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఒక్క సెంచరీతో మహ్మద్ అజారుద్దీన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇపుడు క్రికెట్ అభిమానులు అందరికి తన పేరును తెలిసేలా చేశాడు. అయితే తను భవిష్యత్తులో సాధించాల్సిన కలలను ఓ పేపర్పై రాసి ఇంట్లోని ఓ బోర్డుపై తగిలించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అజారుద్దీన్ కలల జాబితాలో ఐపీఎల్, ఓ రంజీ సీజన్లో 4 సెంచరీలు, సొంత ఇల్లు, బెంజ్ కారు, 2023 ప్రపంచకప్ ఉన్నాయి. ఫొటో చూసిన ఫ్యాన్స్ అజారుద్దీన్ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నారు. ఈ లిస్టు బయటపడిన తర్వాత అజారుద్దీన్ మరింత పాపులర్ అయినట్లు కనిపిస్తోంది.
మహ్మద్ అజారుద్దీన్ పేరు వెనుకే ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది. ప్రస్తుతం కేరళ కోచ్గా ఉన్న టిను యొహానన్ స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని తెలిపాడు. నిజానికి అతనికి ఈ పేరు పెట్టింది అతని సోదరుడు కమ్రుద్దీన్. అతనికి అజర్ అంటే చాలా ఇష్టం. దీంతో తమ్ముడికి తన ఆరాధ్య క్రికెటర్ అజారుద్దీన్ పేరే పెట్టాలని పట్టుబట్టాడు. ఈ అజర్ పుట్టింది 1994లో. అప్పటికి ఇండియన్ క్రికెట్లో అజ్జూ భాయ్ ఓ వెలుగు వెలిగిపోతున్నాడు. ఇండియన్ టీమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా అజ్జూకు పేరున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం మహ్మద్ అజహరుద్దీన్ చెలరేగడంతో కేరళ 2 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అజహరుద్దీన్ ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. 'అజహరుద్దీన్ అత్యుత్తమ ఆటగాడు. ముంబై లాంటి గొప్ప జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం సాధారణ విషయం కాదు. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ చూసి సంతోషించా' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.