
కరాచీ: ఈ తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిన బ్యాట్స్మెన్ లేడని, అతడే నెంబర్ వన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ప్రాక్టీస్ చేయడం తానెప్పుడూ చూడలేదన్నాడు. అయితే ఎవరైనా తనని నేటి తరం క్రికెట్ అంటే ఏమిటని అడిగితే.. అది ట్రైనింగ్ అనే చెప్తానన్నాడు. ప్రస్తుత క్రికెటర్లందరూ ఫిట్నెస్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కోహ్లీ అద్భుత ప్రదర్శనలకు ఫిట్నెస్ కూడా ఓ కారణమని యూసఫ్ అన్నాడు. యూసఫ్ పాక్ తరఫున 98 టెస్టులు, 288 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వూ ఇచ్చిన మహ్మద్ యూసఫ్.. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు. 'విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేయడం నేనెప్పుడూ చూడలేదు. కానీ సోషల్ మీడియాలో కోహ్లీకి సంబందించినా కొన్ని శిక్షణ వీడియోలను చూసాను. ఎవరైనా నన్ను నేటి తరం క్రికెట్ అంటే ఏమిటని అడిగితే.. ట్రైనింగ్ అనే చెప్తాను. ప్రాక్టీస్ ఆటగాడిని ఇంకో స్థాయికి తీసుకెళుతుంది. తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి కుర్రాళ్లు ఫిట్నెస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోహ్లీ అద్భుత ప్రదర్శనలకు కూడా అదే కారణం కావొచ్చు' అని యూసఫ్ అన్నాడు.
'విరాట్ కోహ్లీకి వన్డేల్లో, టెస్టుల్లో కలిపి 70 శతకాలున్నాయి. వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన అతడు టెస్టుల్లో 10 వేల పరుగులకు చేరువయ్యాడు. ఇక టీ20ల్లోనూ మంచి పరుగులే సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. ఈ తరంలో నంబర్ వన్ బ్యాట్స్మన్ అంటే కోహ్లీనే. నేను ఇంతకుముందే ఒక విషయం చెప్పాను. పాత తరం క్రికెటర్లతో ఇప్పటి ఆటగాళ్లను పోల్చడం సరికాదు. అది పక్కనపెడితే.. కోహ్లీ ప్రదర్శనలు నమ్మశక్యం కానివి' అని మహ్మద్ యూసుఫ్ చెప్పుకొచ్చాడు. యూసుఫ్ 288 వన్డేల్లో 9720 రన్స్, 90 టెస్టుల్లో 7530 పరుగులు చేశాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక సచిన్ 100 సెంచరీలకు చేరువలో ఉన్నాడు. మరొక్కటి చేస్తే రికీ పాంటింగ్ సరసన చేరుతాడు.