
లాహోర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత తరంలో గ్రేట్ ప్లేయర్ అని పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడు కోహ్లీనే నంబర్వన్ బ్యాట్స్మన్ అని యూసుఫ్ అన్నాడు. సోమవారం సామాజిక మాధ్యమాల్లో లైవ్ చాట్ నిర్వహించిన యూసుఫ్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.
ట్విట్టర్లో అభిమానులతో ప్రత్యక్ష సంభాషణ సమయంలో మహమ్మద్ యూసుఫ్ను ఒక అభిమాని విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో వివరించమని అడగ్గా... 'కోహ్లీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. గొప్ప ఆటగాడు. ప్రస్తుత తరంలో నంబర్వన్ బ్యాట్స్మన్. ప్రస్తుత తరంలో గ్రేట్ ప్లేయర్' అని యూసుఫ్ పేర్కొన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 86 టెస్టుల్లో 7,240 పరుగులు.. 248 వన్డేల్లో 11,867 పరుగులు.. 82 టీ20ల్లో 2,794 పరుగులు చేసాడు. 2012లో పాకిస్థాన్పై కోహ్లీ అత్యధిక వన్డే స్కోరు 183.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రస్తుతం అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు యూసుఫ్.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరు చెప్పాడు. కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, ఇయాన్ మోర్గాన్ మరియు ఆరోన్ ఫించ్ ఈ మధ్యకాలంలో వైట్-బాల్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లు. పాక్ తరపున యూసుఫ్ 90 టెస్టులు, 288 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. టెస్టుల్లో పా తరపున అత్యధిక పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడు యూసుఫ్.
సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, జాక్వెస్ కల్లిస్ మరియు కుమార్ సంగక్కరలలో ఎవరు బెస్ట్ బ్యాట్స్మన్ అని అడగ్గా.. సచిన్ అని 45 ఏళ్ల యూసుఫ్ జవాబిచ్చాడు. లారా, పాంటింగ్, కల్లిస్, సంగక్కరలను వరుసగా ఎంపిక చేశాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లను సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మరియు ఇతర తారలతో పోల్చలేమన్నాడు. గతంలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లలో మూడు-నాలుగు నాణ్యమైన ఆటగాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు టీంఇండియాలో ద్రవిడ్, సచిన్, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ ఒకే జట్టులో ఉండేవారు. ప్రస్తుత భారత జట్టులో అలాంటి బ్యాట్స్మన్ లేరు. ప్రస్తుత ఆటగాళ్లను సచిన్, ద్రవిడ్లతో పోల్చలేం' అని అన్నాడు.