వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కమాండింగ్ పొజిషన్ లో ఉంది. 229/5 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన విండీస్ టీమ్ కేవలం 26 అరుగుల వ్యవధిలోనే మిగతా ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. వీటిలో నాలుగు వికెట్లు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తీసుకున్నవే.
జస్ప్రీత్ బమ్రా, మహమ్మద్ షమీ వంటి సీనియర్లు లేని సమయంలో భారత పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ అనుభవం గురించి సిరాజ్ తాజాగా మాట్లాడాడు."నిజంగా చెప్పాలంటే.. ఇలా అదనపు బాధ్యతలు అప్పగిస్తే నేను చాలా సంతోషిస్తా. ఇది చాలా గొప్ప అనుభూతి. ఒక పెద్ద సవాల్ కూడా" ని సిరాజ్ అన్నాడు.

"సీనియర్లు ఎవరూ లేని సమయంలో.. నేను మైదానంలో బాధ్యత తీసుకోవాలి. ఈ సవాల్ నాక్కూడా ఇష్టమే" అని నవ్వేశాడీ పేసర్. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సిరాజ్ ఇలా చెలరేగడానికి ఒక్కరోజు ముందే టీమిండియా బౌలింగ్ కోచ్ ఇక్కడి పిచ్ ఏమాత్రం బాగలేదన్నాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, ఇక్కడ 20 వికెట్లు తీసుకోవడం అంత ఈజీ కాదు అని పరాస్ మాంబ్రే అన్నాడు.
ఆ మరుసటి రోజే సిరాజ్ చెలరేగాడు. అతని టెస్ట్ కెరీర్ లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కూడా కావడం గమనార్హం. వర్షం అంతరాయం కలిగించినా కూడా సిరాజ్ బౌలింగ్ లో ఇంటెంట్ తగ్గలేదు. దీని గురించి చెప్పిన అతను.. "మైదానం వీడే సమయంలో శరీరం కూల్ అయిపోతుంది. ఇలాంటి వాతావరణంలో సుదీర్ఘ స్పెల్స్ వేయడం అంత ఈజీ కాదు. అందుకే నా బాడీ ఎప్పుడూ వార్మప్ అయ్యేలా చూసుకుంటా. సింపుల్ ప్లాన్లపై ఫోకస్ పెడతా అంతే" అనిచెప్పాడు.
"ఈ విషయంలో ఎస్ అండ్ సీ కోచ్ సోహం భాయ్ కి నేను చాలా రుణపడి ఉంటా. నా ఫిట్ నెస్ మీద తను చాలా వర్క్ చేశాడు. నేను నిరంతరం ఆడుతూనే ఉన్నా తను నాతో కలిసి అంతగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. నా ఫిట్ నెస్ కు సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్లాన్ చేస్తాడు" అని తన కోచ్ గురించి చెప్పాడు.