
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో చేరడానికి ఆస్ట్రేలియాకు మహ్మద్ షమీ పయనమయ్యాడు. తాను ఆసీస్ వెళ్తున్న టైంలో విమానంలో దిగిన ఫోటోలను తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ మెగా టోర్నీ నుంచి భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో షమీ అతని స్థానంలో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ భారత జట్టు రిజర్వ్ ప్లేయర్లలో షమీ కూడా ఉన్నాడు. అందువల్ల అతని ఎంపిక లాంఛనమేనని తెలుస్తోంది. మరో రిజర్వ్ బౌలర్ దీపక్ చాహర్ గాయం బారిన పడడంతో షమీ ప్రధాన భారత జట్టులోకి వచ్చేందుకు మరింత దారి సుగమమైంది. గత కొంత కాలంగా భారత టీ20 జట్టులో షమీ రెగ్యులర్ ప్లేయర్గా ఉండలేదు. ఇకపోతే భారత బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్ టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యారు. ఇక నాలుగో పేసర్ కోసం భారత జట్టుకు షమీ కన్నా మంచి బౌలింగ్ ఆప్షన్ ప్రస్తుతం కన్పించడం లేదు. ఇక షమీ జట్టుకు ఎంపికైతే.. రిజర్వ్ బౌలర్లలో మరో ఇద్దరిని కూడా తీసుకునే వీలుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున షమీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ ప్రారంభ సీజన్లోనే టైటిల్ గెలుచుకోవడంతో షమీ కీలక పాత్ర పోషించాడు.
నిలకడగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా టీ20 సెటప్లో గత కొన్ని రోజులుగా షమీకి ఛాన్స్లు ఇవ్వట్లేదు. 2021 నవంబర్ నుంచి ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా షమీ ఆడలేదు. ఈ దశలో టీమిండియా చాలా మంది యువ పేసర్లతో ప్రయోగాలు చేసింది. టీ20 ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డేల్లో షమీ ఆడతాడని, కొంత రిథమ్ పొందే అవకాశం ఉందని పలు వార్తలొచ్చినా అతను వన్డే సెటప్లో భాగం కాలేదు. కోవిడ్ వల్ల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లకు మహమ్మద్ షమీ మిస్సయిన సంగతి తెలిసిందే.