IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ స్టార్ బౌలర్ పాకిస్థాన్ పై ఐదు వికెట్లు, ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టు గెలుపులో భాగస్వామ్యమయ్యాడు. కానీ రివర్స్ స్వింగ్ లేకపోవడం పట్ల షమీ విచారం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బంతిపై లాలాజలం రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు మహ్మద్ షమీ కీలక విజ్ఞప్తి చేసాడు. కరోనా కారణంగా 2022లో బంతికి లాలాజలం రాయడంపై ఐసీసీ నిషేధం విధించింది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఐసీసీ ఆ నిర్ణయాన్ని తీసుకుంది.
అసలు విషయం ఏంటంటే.. రివర్స్ స్వింగ్ రాబట్టడానికి పేసర్లు బంతికి ఒకవైపు లాలాజలం అప్లై చేస్తారు. అయితే ఐసీసీ కరోనా నేపథ్యంలో నిషేధం విధించిన తర్వాత ఆటగాళ్లు చెమటను ఉపయోగిస్తున్నారు. దుబాయ్ లో మహ్మద్ షమీ మాట్లాడుతూ.. లాలాజలం వాడకాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. తాము బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని.. కానీ లాలాజలం లేకుండా అలా చేయడం చాలా కష్టమన్నారు. లాలాజలంను అనుమతించాలని తాము నిరంతరం కోరుతూనే ఉన్నామని.. రివర్స్ స్వింగ్ ద్వారా ఆట మరింత ఆసక్తికరంగా మారుతుందని మహ్మద్ షమీ తెలిపాడు.

తన పాత బౌలింగ్ ఫామ్ ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నానని.. జట్టు విజయానికి తోడ్పడడం తన కర్తవ్యమని షమీ చెప్పుకొచ్చాడు. జట్టులోని ఇద్దరు పూర్తి సమయం ఫాస్ట్ బౌలర్లు ప్లేయింగ్ 11లో లేనప్పుడు మరింత బాధ్యత తీసుకుని ఆడవలసి ఉంటుందని చెప్పాడు. జట్టుకు పూర్తి సమయం ఫాస్ట్ బౌలర్ అయినందున తనకు అధిక పనిభారం ఉందని అంగీకరించాడు. వికెట్లు తీయడం, బౌలింగ్ ను నడిపించే బాధ్యత తనపై ఉందని వివరించాడు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో లాలాజలాన్ని నిషేధించగా.. కొవిడ్ లేనందున ఇప్పుడు నిషేధాన్ని ఎత్తివేయాలని చాలా మంది కోరుతున్నారు. దీనివల్ల రివర్స్ స్వింగ్ కళ కనుమరుగవుతున్న పరిస్థితి ఏర్పడింది.