
టీ20 క్రికెట్లో ఒకే ఒక్కడిగా
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వికెట్ కీపింట్తోపాటు బ్యాటర్గా అత్యుత్తమ సేవలు అందిస్తున్న మహ్మద్ రిజ్వాన్ టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరికీ దక్కని రికార్డు ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏకంగా 2 వేలకుపైగా పరుగులు పూర్తి చేసి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ఈ పాకిస్థాన్ వికెట్ కీపర్. దీంతో టీ20 క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 2 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రిజ్వాన్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇందులో అంతర్జాతీయ టీ20ల్లోనే 1326 పరుగులు చేయగా.. మిగతా లీగ్ల్లో కలుపుకుని 2 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 29 మ్యాచ్లు ఆడిన రిజ్వాన్.. 12 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 1326 పరుగులు చేశాడు. సగటు 73గా ఉండగా.. స్ట్రైక్రేట్ 134గా ఉంది. మొత్తంగా 2 వేల పరుగుల్లో 18 హాఫ్ సెంచరీలు.. ఒక సెంచరీ ఉన్నాయి. కాగా గురువారం వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20 లో 11 ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించడం ద్వారా రిజ్వాన్ ఈ ఏడాది టీ20 క్రికెట్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో 45 బంతుల్లోనే 87 పరుగులు చేసి పాక్ విజయంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మొత్తంగా ఈ ఏడాది 2,036 పరుగులు చేశాడు.

రిజ్వాన్ తర్వాతి స్థానంలో అతడే
మహ్మద్ రిజ్వాన్ తర్వాతి స్థానంలో కూడా మరో పాకిస్థాన్ ఓపెనరే ఉండడం గమనార్హం. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఈ ఏడాది టీ20 క్రికెట్లో 1,779 పరుగులు చేశాడు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్లోనే బాబర్ 939 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి ఈ ఏడాది పాకిస్థాన్కు అనేక చిరస్మరణీయ విజయాలు అందించారు. అంతేకాకుండా ఈ ఇద్దరు ఓపెనర్లు మరో రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడిగా నిలిచారు. వీరిద్దరు ఇప్పటివరకు ఆరు సార్లు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్లు రోహిత్శర్మ, కేఎల్ రాహుల్ ఐదు శతక భాగస్వామ్యాలతో రెండో స్థానంలో ఉన్నారు.

పాక్ ప్లేయర్ల తర్వాత విండీస్ వీరుడు
పాకిస్థాన్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ తర్వాతి స్థానంలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 1,665 పరుగులు చేశాడు. ఆ తర్వాత నాల్గొ స్థానంలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 2016లో 1,614 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












