
ఆసియాకప్ 2022లో పాకిస్థాన్తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్లో టీమిండియాపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60) మరోసారి హాఫ్ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ(16 బంతుల్లో 28), కేఎల్ రాహుల్(20 బంతుల్లో 28) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.5ఓవర్లలో 5వికెట్లకు 182పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించినవారిలో ఆ జట్టు ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఒకడు. రిజ్వాన్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు వికెట్ పడకుండా అద్భుతంగా ఆడాడు. మధ్యమధ్యలో వేడికి, ఉక్కపోతకు కాస్త ఇబ్బందిపడ్డప్పటికీ.. జట్టు కోసం పట్టుదలగా పోరాడాడు. దాదాపు 17ఓవర్ల పాటు క్రీజులో ఉండి.. పాక్ విజయానికి మంచి బాటలు వేశాడు.
అతను తొలుత బాబర్ ఆజామ్తో 22, ఫాఖర్ జమాన్తో కలిసి 41, నవాజ్తో కలిసి 73 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు స్కోరును నడిపించాడు. ఇక చివరి ఓవర్లో 7పరుగులు చేయాల్సిన దశలో అర్షదీప్ సింగ్ బౌలింగ్ వేశాడు. అతని బౌలింగ్లో చివరి 2బంతులకు 2పరుగులు చేయాల్సిన దశలో ఇఫ్తీకర్ స్ట్రెయిట్ ఆడి 2పరుగులు చేయడంతో పాక్ విజయం ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ కీలక క్యాచ్ మిస్ చేయడం పాక్కు కలిసొచ్చింది.
ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. 'ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ని చూస్తుందని తెలుసు. ఈ గేమ్ ఫైనల్గా మాకు చాలా విలువైనది. ఈ మ్యాచ్లో ఆడే ఇరు జట్ల ప్లేయర్లు తమ 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటిలాగే మా ఇద్దరిలో (బాబర్ ఆజామ్, రిజ్వాన్) ఒకరు లాంగ్ టైం బ్యాటింగ్ చేసేలా క్రీజులో ఉండాలి.
కొత్త బంతిపై కాస్త జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ చేయాలనేది ప్లాన్. నేను చివరి వరకు ఉండేందుకు ప్రయత్నించాను. మా దమ్మేంటో మాకు తెలుసు.. మా బ్యాటింగ్లో మంచి డెప్త్ ఉంది. చివరి నాలుగు ఓవర్లలో ఏ జట్టుపైన అయినా ఈజీగా 45పరుగులు కొట్టగల పవర్ హిట్టర్లు మా జట్టులో ఉన్నారు. కాబట్టి మేము కించిత్ భయపడలేదు.' అని రిజ్వాన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.