పాకిస్థాన్ వైట్ బాల్ జట్లకు కొత్త కెప్టెన్ వచ్చాడు. వన్డే, టీ20ల జట్టుకు మహ్మద్ రిజ్వాన్ను సారథిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. వైస్ కెప్టెన్గా సల్మాన్ అఘూను నియమించింది. లాహోర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి రిజ్వాన్ను కెప్టెన్గా పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ఆదివారం వెల్లడించాడు. గత రెండేళ్లలో పాకిస్థాన్ జట్టుకు సారథిగా బాధ్యతలు అందుకున్న నాలుగో వ్యక్తి మహ్మద్ రిజ్వాన్.
2023 వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ బాబార్ అజామ్ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ అఫ్రిది జట్టు పగ్గాలు అందుకున్నారు. టెస్టు ఫార్మాట్కు కెప్టెన్గా షాన్ మసూద్ కొనసాగుతున్నాడు. కానీ, ఒక్క టీ20 సిరీస్తోనే షాహిన్ అఫ్రిదిని తొలగించారు. తిరిగి బాబర్ అజామ్ను వైట్ బాల్ ఫార్మాట్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

అయితే టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో మరోసారి బాబర్ అజామ్ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే ఈసారి బాబర్ తన ఆటపై దృష్టిసారించి ఈ నిర్ణయం తీసుకున్నాడని మీడియా సమావేశంలో పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ పేర్కొన్నాడు. సెలక్టర్లు జాగ్రత్తగా ఆలోచించి మహ్మద్ రిజ్వాన్ను కెప్టెన్గా నియమించారని మోహ్సిన్ తెలిపాడు.
మరోవైపు కెప్టెన్గా బాధ్యతలు అందకున్న మహ్మద్ రిజ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టులో ఇకపై ఒకే గ్రూప్ ఉంటుందని, అది పాకిస్థాన్ క్రికెట్ టీమ్ గ్రూప్ అని పేర్కొన్నాడు. జట్టుకు తాను రాజుని కాదని, సేవకుడిని అని అన్నాడు. ఆస్ట్రేలియాలో సత్తాచాటడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడటమే పాకిస్థాన్ లక్ష్యమని రిజ్వాన్ అన్నాడు.
కాగా, ఇంగ్లండ్తో చివరి రెండు టెస్టులకు జట్టులో చోటు కోల్పోయిన బాబార్ అజామ్, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా తిరిగి స్థానం దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్లకు ఎంపికైన వాళ్లు జింబాబ్వే పర్యటనలోని వన్డే, టీ20 సిరీస్లకు చోదు దక్కించుకోలేదు.