రెండు రోజులు ఐసీయూలోనే:
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ల జట్ల మధ్య దుబాయ్ వేదికగా గురువారం టీ20 ప్రపంచకప్ 20221 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కి రెండ్రోజుల ముందు పాక్ యువ ఆటగాడు మొహ్మద్ రిజ్వాన్.. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజులు ఐసీయూలోనే ఉన్నాడు. ఇక కీలక సెమీస్ మ్యాచ్కు ముందు రోజు అతడు కోలుకున్నాడు. రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్కు దూరంగా ఉండమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సహా సహచర ఆటగాళ్లు సూచించారు. అయినప్పటికీ తాను కీలక సెమీస్ మ్యాచ్లో ఆడతనని రిజ్వాన్ పట్టుబట్టాడట. ఇక ఫిట్గా ఉన్నాడని నిర్ధారించాక అతడిని మ్యాచ్ ఆడేందుకు అనుమతించారు.

అతని డెడికేషన్ సూపర్:
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీస్ మ్యాచులో మొహ్మద్ రిజ్వాన్ అద్భుతంగా ఆడాడు. పాక్ జట్టుకు మంచి ఆరంభం అందించాడు. కెప్టెన్ బాబర్ బాబర్ ఆజామ్ (39)తో కలిసి పాక్ జట్టుకు 50కి పైగా భాగస్వామ్యం అందించాడు. ఇక చివరలో రెచ్చిపోయి ఆడి హాఫ్ సెంచరీ (67) చేశాడు. మైదానంలో ఉన్న సమయంలో రిజ్వాన్ అనారోగ్యం ఛాయలేవీ కనిపించకుండా అద్భుతంగా ఆడాడు. ఆపై వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగ్గా చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ పోస్ట్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. 'ఈ వ్యక్తి ఈరోజు తన దేశం కోసం మ్యాచ్ ఆడాడు అంటే నమ్మగలరా?. మ్యాచుకు రెండ్రోజుల ముందు మొహ్మద్ రిజ్వాన్ ఐసీయూలో చికిత్స పొందాడు. అతని డెడికేషన్ సూపర్. అతడు హీరో' అని అక్తర్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు పాక్ ఆటగాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చిత్తు:
గురువారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫఖర్ జమన్ (32 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (39; 5 ఫోర్లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభంలో మెరుపులు మెరిపిస్తే.. మార్కస్ స్టొయినిస్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఊహించని విజయాన్ని అందించారు.


Click it and Unblock the Notifications












