
హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మహ్మద్ నబీ బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు.
ఈ మేరకు ఆప్ఘనిస్థాన్ టీమ్ మేనేజర్ నజీమ్ జర్ అబ్దుర్రాహీమ్ జాయ్ వెల్లడించాడు. చోట్టాగ్రామ్లోని జహర్ అహ్మాద్ చౌధురి స్టేడియం వేదికగా గురువారం ఆప్ఘనిస్థాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఏకైక టెస్టులో నబీ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు.
ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనే విషయాన్ని బోర్డుకు తెలిపాడు. "అవును.. బంగ్లాదేశ్తో టెస్టు తర్వాత నబీ రిటైర్ అవుతున్నాడు. నబీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. టెస్టు ఫార్మాట్ నుంచి నబీ తప్పుకోవడానికి గల కారణాలను మేము అర్థం చేసుకోగలం" అని నజీమ్ తెలిపాడు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులకు ఆలౌటైంది. ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్మన్ రహ్మాత్ షా(102) సెంచరీ రాణించగా... అస్గర్ అఫ్గాన్(92) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా, మహ్మద్ నబీ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో ఆప్ఘనిస్థాన్ జట్టు ఆడటం లేదు. కేవలం తొమ్మిది దేశాలు మాత్రమే ఈ టెస్టు ఛాంపియన్షిప్ను ఆడుతున్నాయి. ఈ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా తొమ్మిది దేశాలు రెండేళ్ల కాలానికి గాను 27 ద్వైపాక్షిక సిరిస్లతో మొత్తం 71 టెస్టులు ఆడనున్నాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్తో ఆడుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్ ఆప్ఘనిస్థాన్కు మూడో టెస్టు కావడం విశేషం. ఆ తర్వాత నవంబర్ 27వ తేదీన డెహ్రాడూన్ వేదికగా వెస్టిండిస్తో ఆప్ఘనిస్థాన్ మరో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది.