హైదరాబాద్: ఆప్ఘనిస్ధాన్ జట్టుకు టెస్టు హోదా దక్కడంలో బీసీసీఐ చేసిన సాయాన్ని మరువలేమని ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ ధన్యవాదాలు తెలిపాడు. ఇది ప్రతి ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ చిరకాల వాంఛ అని అతడు పేర్కొన్నాడు. ఆప్ఘనిస్థాన్తో పాటు ఐర్లాండ్కు కూడా ఐసీసీ టెస్టు హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మహమ్మద్ నబీ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఇన్నాళ్లకు తమ కల సాకారమైందని, ఈ కలను సాకారం చేయడంలో బీసీసీఐ పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. అయితే తమ తొలి టెస్టు టీమిండియాతో గ్రేటర్ నోయిడాలో ఆడితే బాగుంటుందని తన మనసులో మాటను సైతం నబీ బయట పెట్టాడు.
భారత క్రికెట్ అభిమానుల ప్రోత్సాహం మరువలేనిదని, తమను స్వదేశీ ఆటగాళ్లలా ప్రోత్సహిస్తారని తెలిపాడు. ఆప్ఘనిస్థాన్లో క్రికెట్ను ప్రోత్సహించేందుకు బీసీసీఐ ఎన్నో విధాలుగా దోహదపడుతోన్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ వర్థమాన క్రికెటర్లకు బీసీసీఐ పలు సౌకర్యాలు కల్పించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు ఆప్ఘన్లో వర్థమాన క్రికెటర్లు తయారయ్యేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డుతో ఎంవోయూ ప్రోగ్రాంలు కూడా బీసీసీఐ ఏర్పాటు చేస్తుంది. భారత్లోని ఆటగాళ్లతో మ్యాచ్లు నిర్వహిస్తూ ఆప్ఘన్ క్రికెటర్ల ప్రతిభను పెంచుతోన్న సంగతి తెలిసిందే. గురువారం ఐసీసీ ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ దేశాలకు టెస్టు హోదా కల్పించింది.
ప్రతిఫలం దక్కింది: ఆప్ఘన్, ఐర్లాండ్లకు టెస్టు హోదా
లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఐసీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ పది దేశాలకు టెస్టు హోదా ఉంది. దాదాపు 17 సంవత్సారాల అనంతరం మరో రెండు దేశాలు ఈ జాబితాలో చేరాయి. చివరిసారిగా బంగ్లాదేశ్ 2000లో టెస్టు హోదా పొందింది.
ఇప్పటివరకు టెస్టు మ్యాచ్లు ఆడే దేశాలు పది ఉండగా, ఇప్పుడా సంఖ్య 12కు పెరిగింది. ఇటీవలే వెస్టిండీస్తో వన్డే సిరీస్ను అప్ఘనిస్థాన్ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. 2011లో వన్డే హోదా పొందిన ఆ జట్టు 2015లో వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు సంపాదించింది.