ఐపీఎల్-2024లో లీగ్ స్టేజ్ క్లైమాక్స్కు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లు తేలనున్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. మిగిలిన రెండు స్థానాల కోసం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.
ఎస్ఆర్హెచ్కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేతో జరగనున్న మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి. కేవలం గెలిస్తే సరిపోదు, ఛేదన అయితే 18.1 ఓవర్లలోపు, ఢిఫెన్స్ చేయాల్సి వస్తే 18 పరుగుల తేడాతో నెగ్గాలి. అయితే గత నెలలో పేలవ ప్రదర్శనే ఆర్సీబీ కొంపముంచిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఈ సీజన్లో బెంగళూరు వరుసగా ఆరు ఓటములు చవిచూసిన విషయం తెలిసిందే.

''ఆర్సీబీ చెత్తగా ఆడి వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడింది. టోర్నీలో దాదాపు నెల రోజుల పాటు విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే సమీకరణాల్లొ వెనుకబడ్డారు. అయితే ఆ తర్వాత సత్తాచాటి వాళ్లు సాధించిన గొప్ప పునరాగమనాన్ని మెచ్చుకోవాలి. కానీ బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఎలా ఆడాలో ఆర్సీబీకి ఇదో గుణపాఠం. భారత ప్లేయర్లకు వాళ్లు అండగా నిలవాలి''
'' భారత ఆటగాళ్లకు మద్దతు ఇచ్చిన కేకేఆర్ ప్రస్తుతం టాప్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ది కూడా అదే తరహాలో ఉంది. ఆర్సీబీ కూడా భారత ప్లేయర్లను తీసుకురావాలి. వాళ్లకి శిక్షణ ఇచ్చి సానబెట్టాలి. వాళ్లకు అండగా నిలవాలి. ఆర్సీబీకి విదేశీ ప్లేయర్లపై మక్కువ ఎక్కువ. మాక్స్వెల్ వంటి స్టార్లు లేకుండా ఎలా గెలవాలో బెంగళూరు ఇప్పుడు నేర్చుకుంటుంది. అయితే భారత ప్లేయర్ల కోసం పెట్టుబడి పెడితేనే, ఆర్సీబీ కప్ను గెలుస్తుంది'' అని మహ్మద్ కైఫ్ అన్నాడు. ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిన మాక్స్వెల్ తుదిజట్టులో నుంచి చోటు కోల్పోయాడు. మాక్సీ లేకుండానే ఆర్సీబీ విజయాలతో హోరెత్తిస్తోంది.