మరో ఎనిమిది రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే విరాట్ కోహ్లిపైనే అందరి కళ్లు. దాదాపు రెండు నెలల తర్వాత కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
జనవరిలో అఫ్గానిస్థాన్తో విరాట్ కోహ్లి టీ20 సిరీస్ ఆడాడు. అనంతరం ఇంగ్లండ్ సిరీస్కు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలతో కోహ్లి జట్టుకు దూరమయ్యాడు. అయితే పునరాగమనంలో కోహ్లి ఫామ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. వన్డే వరల్డ్ కప్ నుంచి ప్రైమ్ ఫామ్లో ఉన్న కోహ్లికి విరామం ప్రభావం చూపుతుందేమోననే సందేహాలు అందరిలో పెరిగాయి.

దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడాడు. రీఎంట్రీలో ప్రతిసారి విరాట్ కోహ్లి అదరగొట్టాడని, ఈసారి కూడా సత్తాచాటుతాడని కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే కోహ్లిపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భవిష్యత్ ఆధారపడి ఉందని అన్నాడు. ప్లేఆఫ్స్కు చేరాలంటే కోహ్లి తప్పక రాణించాలని కైఫ్ పేర్కొన్నాడు.
'' గత రెండేళ్ల నుంచి విరాట్ కోహ్లి అద్భుతంగా ఆడుతున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో ఎలా పరుగులు సాధించాలో కోహ్లి వంటి ఆటగాళ్లకి తెలుసు. అంతేగాక అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లి గురించి ఓ ప్రత్యేకమైన విషయం చెప్పాలంటే.. పునరాగమనంలో ప్రతిసారి కోహ్లి అదరగొట్టాడు. నిజంగా గొప్పగా రాణించాడు. అయితే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను కోహ్లి ఫామ్ నిర్ణయిస్తుంది. కోహ్లితో పాటు గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ ఫామ్ కూడా బెంగళూరుకు ఎంతో కీలకం'' అని మహ్మద్ కైఫ్ తెలిపాడు.
ఐపీఎల్-2022లో విరాట్ కోహ్లి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 53 సగటుతో 639 పరుగులు చేశాడు. అయితే జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు కోహ్లిని తప్పించే యోచనలో బీసీసీఐ ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. కోహ్లికి ఈ ఐపీఎల్ సీజన్ ఎంతో కీలకం కానుంది.