ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ తెలిపాడు. గతేడాది జరిగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ.. ఈసారి ఆ ఒక్క మెట్టు ఎక్కాలనే లక్ష్యంతో ఉందని కైఫ్ చెప్పాడు. ఐపీఎల్ 2020లో తొలిసారి ఫైనల్ చేరిన అయ్యర్ సేన ఫైనల్ పోరులో నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 156 పరుగులు చేయగా.. మరో ఎనమిది బంతులు ఉండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిసిన మహ్మద్ కైఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'ఐపీఎల్ 2021లో మిగిలిన ఆ ఒక్క మెట్టు ఎక్కాలని అనుకుంటున్నాం. అదే మా లక్ష్యం. అది సాధించడానికి గల ఆటగాళ్లు మాకున్నారు. కప్పు సాధించడానికి గతేడాది మేం చాలా దగ్గరి వరకూ వెళ్లాం. అదే ఈసారి మాకు అతిపెద్ద సానుకూలత. రిషబ్ పంత్తో పాటు చాలా మంది కీలక ఆటగాళ్లు ఇటీవల బాగా ఆడుతున్నారు. మంచి ఫామ్లో ఉన్నారు. అయితే కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయం కాస్త నిరాశపరిచింది' అని కైఫ్ తెలిపాడు.
'మా ఆటగాళ్లంతా ఇప్పటికే సాధన మొదలెట్టారు. ముఖ్యంగా ఫ్లడ్లైట్ల కింద క్యాచులు పట్టడం నేర్చుకుంటున్నారు. ఈ సారి కొంతమంది యువ ఆటగాళ్లు, అనుభవం లేని వారిని కూడా కలిశాను. అలాగే ఆర్ అశ్విన్, అజింక్య రహానే వంటి కీలక ఆటగాళ్లతో మాట్లాడా. మా కోచ్ రికీ పాంటింగ్ ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు. అతడిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా. పాంటింగ్ బయటకు రాగానే మా ప్రాక్టీస్కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తాం' అని మహ్మద్ కైఫ్ చెప్పాడు.
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తన ఫస్ట్ మ్యాచ్ని చెన్నై సూపర్ కింగ్స్తో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 10న తలపడనుంది. ఇప్పటికే ముంబై చేరుకున్న ఢిల్లీ.. ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది. ఇటీవల ఢిల్లీ క్యాంప్లో చేరిన ఆ జట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్కి.. రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్గా వచ్చింది. ప్రస్తుతం అక్షర్ ఐసోలేషన్లో ఉంచి మెడికల్ టీమ్ చికిత్స అందిస్తోంది. అక్షర్ మొదటి మ్యాచ్ ఆడేది అనుమానంగానే ఉంది.
IPL 2021: నెట్టింట వైరల్గా మారిన వాషింగ్టన్ సుందర్ 'కుక్క' పేరు! ఎందుకో తెలుసా?