IND vs PAK: ఆసియా కప్ చరిత్రలోనే తొలి సారి భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో నేడు తలపడనున్నాయి. ఫైనల్లో భారత జట్టుతో తలపడటానికి పాకిస్తాన్ జట్టు సిద్ధమవుతున్న వేళ.. ఆ జట్టు మాజీ కెప్టెన్, మాజీ క్రికెట్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టీమ్ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాల కంటే దిగువన ఉందని ఆయన నిర్మొహమాటంగా అంగీకరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య టైటిల్ పోరు ప్రారంభం కానుంది. సూపర్-4 దశలో భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. బంగ్లాదేశ్, శ్రీలంకలను ఓడించి పాకిస్తాన్ ఫైనల్కు చేరుకుంది. అయితే టీమిండియా ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు అజేయంగా ఉండి ఫైనల్ చేరింది.
అంతర్జాతీయ ప్రమాణాలకు దిగువనే ఉన్నాం..
ఓ పోడ్ కాస్ట్లో మాట్లాడిన పాక్ మాజీ కెప్టెన్ హఫీజ్.. పాకిస్తాన్ జట్టు ఆటతీరుపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. "మీరు బాగా ఆడలేదు.. కానీ కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారి, ఏదో విధంగా మీరు ఫైనల్కు చేరుకున్నారు. పాకిస్తాన్ ఫైనల్కు చేరడం మంచి సంకేతమే. కానీ మీరు మొత్తంగా చూస్తే మేము అంతర్జాతీయ ప్రమాణాల కంటే కొంచెం దిగువకు వచ్చేశాం. ఈ విషయాన్ని అంగీకరించి, మన అభివృద్ధిపై మనం దృష్టి పెట్టడం మంచిది" అని మహ్మద్ హఫీజ్ అన్నారు.

హఫీజ్ పదవి కోల్పోవడం వెనుక...
2023 ప్రపంచ కప్ తర్వాత మహ్మద్ హఫీజ్ను పాకిస్తాన్ జట్టుకు డైరెక్టర్గా నియమించారు. హఫీజ్ కాంట్రాక్ట్ 4 ఏళ్లు ఉన్నప్పటికీ.. జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో పేలవమైన ప్రదర్శన చేయడంతో కేవలం 2 నెలల్లోనే మహ్మద్ హఫీజ్ను ఆ పదవి నుంచి తొలగించారు.
ప్రతి మ్యాచ్లోనూ పోరాడిన పాకిస్తాన్
ఈ ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టు ప్రతి మ్యాచ్లోనూ విజయం కోసం పోరాడాల్సి వచ్చింది. శ్రీలంక, బంగ్లాదేశ్లపై సూపర్ 4 లో సాధించిన విజయాలు కూడా చాలా కష్టం మీద వచ్చినవే. ఆ రెండు మ్యాచ్లలోనూ ఒకానొక సమయంలో పాకిస్తాన్ ఓటమి ఖాయమనిపించింది. యూఏఈ, ఒమన్ వంటి బలహీన జట్లపై కూడా పాకిస్తాన్ బ్యాటర్లు నిరాశపరిచారు. అయినప్పటికీ బౌలర్ల జట్టుకు విజయాలను అందించింది. ఇక భారత్తో జరిగిన మ్యాచ్లోనైతే, పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగం రెండూ దారుణంగా విఫలమయ్యాయి.