
హెచ్సీఏలో అవినీతి ఆరోపణలు:
అవినీతి, అక్రమాల్లో హెచ్సీఏ కూరుకుపోయిందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. హెచ్సీఏ పరిపాలన గాడితప్పడం చూస్తున్నాం. ప్రతిభావంతులైన క్రికెటర్లకు ఎప్పటినుంచో అన్యాయం జరుగుతోంది. హెచ్సీఏ పెద్దలు, టీమిండియా టెస్టు క్రికెటర్లు కూడా కట్టుతప్పారు. దీంతో హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఆటగాళ్లు జాతీయ జట్టుకు వెళ్లడంలేదు. హెచ్సీఏలో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై అధ్యక్ష, కార్యదర్శులను ఆదివారం జరిగిన సమావేశంలో మెంబర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. ఏజీఎంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. నువ్వు ఫిక్సర్.. నువ్వు దొంగ అంటూ తిట్టుకున్నారు.

దీపక్ వర్మ నియామకంలో గొడవ:
మహ్మద్ అజహారుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఏజీఎం అసంపూర్తిగా ముగిసింది. అంబుడ్స్మన్గా జస్టిస్ దీపక్ వర్మ నియామకం విషయంలో పెద్ద గొడవ జరిగింది. దీపక్ వర్మ వద్దంటూ అర్షద్ అయూబ్ బృందం నినాదాలు చేసింది. జస్టిస్ నిసార్ అహ్మద్ కుక్రూను అంబుడ్స్మన్గా నియమించాలని అర్షద్ సూచించాడు. ఈ ప్రతిపాదనకు శివలాల్ యాదవ్ మద్దతు తెలిపాడని హెచ్సీఏ కార్యదర్శి విజయానంద్ వేదిక మీద నుంచి ప్రకటించాడు. అయితే విజయానంద్ను అజహారుద్దీన్ వారించాడు. దీపక్ వర్మకే అందరి మద్దతు ఉందని వెల్లడించాడు. ఈలోపు జస్టిస్ మీనాకుమారి పేరు తెరపైకి వచ్చింది. దీంతో సమావేశ మందిరంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

అయూబ్, అజహర్ల మధ్య మాటల యుద్ధం:
అంబుడ్స్మన్ విషయంలో మాజీ టెస్టు ఆటగాళ్లు అర్షద్ అయూబ్, అజహర్లు తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో సాగింది. 'నువ్వు మ్యాచ్ ఫిక్సర్.. దేశాన్ని అమ్మేశావు' అంటూ అజ్జూను అర్షద్ విమర్శించాడు. 'నువ్వు హెచ్సీఏను దోచుకున్నావు. నీ మోసాలన్నీ నాకు తెలుసు. ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. నీ సంగతి తేలుస్తా' అంటూ అర్షద్ను అజ్జూ హెచ్చరించాడు. బీసీసీఐలో హెచ్సీఏకు తానే ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశాడు. 'ఏజీఎంలో నీ ప్రవర్తనపై బీసీసీఐ, హైకోర్టుకు ఫిర్యాదు చేస్తా' అంటూ అజహర్ ప్రకటించడంతో అందరూ వెనక్కి తగ్గారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామంటూ రాజీకి వచ్చారు.

ఏప్రిల్ 11కు ఏజీఎం వాయిదా:
సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ కూడా హాజరయ్యారు. అయితే ఆయన సమావేశం నుంచి మధ్యలోనే వెనుదిరిగారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... 'హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయింది. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్ కానీ, స్టేడియం కానీ లేదు. ఆంద్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది' అని ఆరోపించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ అజ్జూ కు టీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉన్నాయన్నారు. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏప్రిల్ 11కు ఏజీఎం వాయిదా పడింది. ఎవరిని నియమించాలన్నది ఆరోజు నిర్ణయిస్తాం.


Click it and Unblock the Notifications












