
పునరాగమనం చేసే అవకాశం రాలేదు
అప్పట్లో మహ్మద్ అసిఫ్పై ఉన్న ఏడేళ్ల నిషేధాన్ని ఐదేళ్లకు తగ్గించినా.. ఆ తర్వాత అతనికి పాక్ జట్టులో పునరాగమనం చేసే అవకాశం మాత్రం రాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిక్సింగ్కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం ఇచ్చినా.. తనకు మాత్రం రెండో చాన్స్ ఇవ్వలేదని అసిఫ్ ఆవేదన వ్యక్తం చేసాడు. తన సహచర బౌలర్ మహ్మద్ అమిర్ కూడా ఫిక్సింగ్లో ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడాన్ని అసిఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు.

ఎవరికైనా రెండో అవకాశం ఉంటుంది
తాజాగా మహ్మద్ అసిఫ్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ...'అందరూ తప్పులు చేస్తారు. నేను కూడా చేశాను. ఆటగాళ్ళు నా కంటే ముందు ఫిక్సింగ్ చేసిన వాళ్లు ఉన్నారు, నాతో చేసిన వాళ్లు ఉన్నారు, నా తర్వాత చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఎవరికైనా రెండో అవకాశం ఉంటుంది. ఫిక్సింగ్ చేసిన వేరే వాళ్లకి ఆడే అవకాశం ఇచ్చిన పీసీబీ.. నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా ఉంటుందా పీసీబీ వ్యవహారం' అని ప్రశ్నించాడు.

ఫిక్సింగ్కు పాల్పడిన క్రికెటర్లను పీసీబీ కాపాడింది
'ఫిక్సింగ్కు పాల్పడిన కొంతమంది క్రికెటర్లను పీసీబీ కాపాడింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పీసీబీ మనుషులు కాబట్టి వారిని రక్షించుకుంది. నన్ను ఏ విషయంలోనూ బోర్డు పట్టించుకోలేదు.పాకిస్తాన్ క్రికెట్లో నేనే చివరి ఫిక్సర్ను అన్నట్లు వ్యవహరిస్తోంది. నా తర్వాత కూడా చాలా మంది ఫిక్సింగ్ చేశారు. వారికి కూడా పీసీబీ అవకాశం ఇచ్చింది. కొంతమంది ఏకంగా పీసీబీలోనే ఉన్నారు. వారు దర్జాగా తమ పదవుల్లో కొనసాగుతున్నారు' అంటూ అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

విజయం కోసం ఎప్పుడూ శ్రమించేవాడిని
'ఇక్కడితో తన ప్రపంచం ఏమీ అయిపోలేదు. జరిగిపోయిందేదో జరిగింది, ఇక జరగాల్సింది మాత్రమే ఉంది. నా కెరీర్లో చాలా క్రికెట్ను ఆడేశా. నేను క్రికెట్ ఆడే సమయంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. కొన్ని ప్రదర్శనలలో గర్వపడుతున్నా. ప్రపంచం ఇప్పటికీ నన్ను గుర్తుంచుకుంటుంది, ప్రజలు నా గురించి మాట్లాడుతారు. నేనెప్పుడు స్వార్థపరుడిలా ఉండేవాడినని చాలా మంది అంటారు. అది వికెట్లు తీసి జట్టును గెలిపించాలనే స్వార్థం మాత్రమే ఉండేది. జట్టు విజయం కోసం ఎప్పుడూ శ్రమించేవాడిని, ఒకవేళ అదే స్వార్థమైతే నేను ఏమీ చేయలేను' అని అసిఫ్ పేర్కొన్నాడు. అసిఫ్ పాక్ తరపున 23 టెస్టులు, 38 వన్డేలు, 11 టీ20లు ఆడాడు.


Click it and Unblock the Notifications












