హైదరాబాద్: పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అమిర్ తండ్రయ్యాడు. అమిర్ సతీమణి మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అమిర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 2010లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ స్ఫాట్ ఫిక్సింగ్కి పాల్పడిన అమిర్ ఐదేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు.
ఆ సమయంలో కొన్నాళ్ల పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు. దీంతో అతని కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. నిషేధం ముగిసిన అనంతరం రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అమిర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్ని జట్టులో నెంబర్ వన్ బౌలర్గా ఎదిగాడు.

ఈ ఏడాది ఇంగ్లండ్లో ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్తో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ విజయంలో అమిర్ కీలకపాత్ర పోషించాడు. కాగా, తన భార్య ప్రసవం కారణంగా మంగళవారం నుంచి వరల్డ్ ఎలెవన్ జట్టుతో పాకిస్థాన్ జట్టు ఆడే మూడు టీ20ల సిరిస్కు దూరమయ్యాడు. బోర్డుతో పాటు పాక్ కోచ్ నుంచి అనుమతి తీసుకుని లండన్ వెళ్లాడు.