
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలిస్తే.. ఓపెనర్ రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం తేలికని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అన్నాడు. బంతిని రెండువైపులా స్వింగ్ చేసి రోహిత్ను పెవిలియన్కు పంపించొచ్చన్నాడు. ఒత్తిడిలో విరాట్ అత్యుత్తమంగా ఆడతాడు కాబట్టి అతడిని ఔట్ చేయడం కాస్త కష్టమని ఆమిర్ తెలిపాడు. ఏదేమైనా వీరిద్దరికీ బౌలింగ్ చేయడం తనకు సులువేనని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ప్రపంచ మేటి బ్యాట్స్మన్లు. ఓపెనర్గా రోహిత్.. వన్ డౌన్లో కోహ్లీ పరుగుల వరద పారిస్తారు. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా బాదడమే వారికి తెలుసు.
తాజాగా మహ్మద్ ఆమిర్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ బౌలింగ్ చేయడం కష్టమేం కాదు. నిజానికి రోహిత్కు బౌలింగ్ చేయడం తేలిక. బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తూ అతడిని ఔట్ చేయగలను. ఎడమచేతి వాటం పేసర్ విసరే ఇన్స్వింగర్లకు రోహిత్ ఇబ్బంది పడతాడు. ముందుగానే బ్యాటు నుంచి దూరంగా వెళ్లే బంతులూ ఆడలేడు. ఒత్తిడిలో రాణిస్తాడు కాబట్టి కోహ్లీని ఔట్ చేయడం కాస్త కష్టమని చెప్పొచ్చు. అయితే విరాట్, రోహిత్కు బౌలింగ్ చేయడం నాకైతే కఠినంగా అనిపించదు' అని అన్నాడు.
2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాదిలోనే పాక్ అత్యుత్తమ బౌలర్గా ఎదిగాడు. ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే 2010లో ఇంగ్లాండ్ పర్యటనలో స్ఫాట్ ఫిక్సింగ్కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. దాంతో అమీర్ కెరీర్ ముగిసిపోయిందని అంతా ఊహించారు. కానీ 2015-2016లో మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అమీర్.. అగ్రశ్రేణి బౌలర్గా మారాడు. గత ఏడాది అనూహ్యంగా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ పెద్దలకి కోపం తెప్పించాడు. అప్పటి నుంచి పీసీబీ నుంచి కూడా అతనికి మొండిచేయి ఎదురవుతూ వచ్చింది. ఆపై అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చాడు, పాక్ తరఫున 36 టెస్టులాడిన అమీర్ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ క్రికెట్కి గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ అమీర్ ప్రస్తుతం తన భార్య, పిల్లలతో కలిసి లండన్లో ఉంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్ క్రికెట్ టోర్నీలు ఆడాలని అతడు భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా బ్రిటీష్ సిటిజన్షిప్ తీసుకుని.. ఐపీఎల్లో ఆడాడు. పంజాబ్ కింగ్స్ తరఫున గతంలో అతడు కొన్ని మ్యాచ్లు ఆడాడు.