టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్, దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించగా, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ ఓటమితో సెమీఫైనల్ రేసులో భారత్ పరిస్థితి ఇప్పుడు క్లిష్టంగా మారింది.
అమీర్ జోస్యం నిజమవుతుందా?
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ ఈసారి సెమీఫైనల్ చేరడం కష్టమని, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాయని అమీర్ టోర్నీకి ముందే జోస్యం చెప్పాడు. అప్పట్లో భారత అభిమానులు ఈ కామెంట్లను కొట్టిపారేసినప్పటికీ.. తాజా ఫలితాలు అమీర్ అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయని సూచిస్తున్నాయి. స్టూడియోలో కూర్చుని అమీర్ విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు భారత్కు ఓ రకమైన ఒత్తిడిని కలిగిస్తోంది.

తనదైన స్టైల్లో స్పందించిన పాక్ మాజీ దిగ్గజం
ఈ పరిణామాలపై పాక్ మాజీ దిగ్గజం మహమ్మద్ యూసఫ్ తనదైన శైలిలో స్పందించాడు. అమీర్ను ఒక 'మెనస్' (తీవ్రమైన ఇబ్బంది కలిగించేవాడు) గా అభివర్ణిస్తూ.. "మైదానంలో ఉన్నప్పుడు వికెట్లతో భారత బ్యాటర్లను వణికించావు, ఇప్పుడు స్టూడియోలో ఉండి నీ మాటలతో వారిని ఆందోళనకు గురిచేస్తున్నావు" అంటూ ఎక్స్ (X) వేదికగా సెటైర్లు వేశాడు. భారత్ ఇప్పటికే విమర్శల పాలవుతోందని, వారిని కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనివ్వాలని అమీర్కు చమత్కారంగా సూచించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే..
దక్షిణాఫ్రికా ఆరంభంలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పటికీ, డేవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45) వీరోచితంగా పోరాడి జట్టుకు 187 పరుగుల భారీ స్కోరును అందించారు. అనంతరం 188 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. మార్కో జాన్సెన్ నిప్పులు చెరిగే బంతులకు భారత టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. శివమ్ దూబే చేసిన 42 పరుగులు తప్ప, మిగిలిన వారెవరూ కనీస ప్రతిఘటన చూపకపోవడంతో భారత్ 111 పరుగులకే పరిమితమైంది.
ప్రస్తుత సమీకరణాల ప్రకారం..
భారత్ సెమీఫైనల్ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్తో జరిగే మిగిలిన రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా భారీ తేడాతో విజయం సాధించాలి. ఈ ఓటమితో నెట్ రన్ రేట్ బాగా పడిపోవడం భారత్ ఆశలను దెబ్బతీస్తోంది. ఒకవేళ వచ్చే మ్యాచ్ల్లో ఏమాత్రం తేడా వచ్చినా, ఆతిథ్య దేశంగా ఉండి కూడా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం పొంచి ఉంది. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ ఈ క్లిష్ట పరిస్థితి నుండి జట్టును ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలి.