కరాచీ: ఐసీసీ 2019 సంవత్సరానికి గానూ అన్ని ఫార్మాట్లలో, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు'కు ఎంపికయ్యాడు. 2019 ప్రపంచకప్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను ప్రోత్సహించాలని కొహ్లీ తన సైగల ద్వారా అభిమానులకు సూచించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. దీంతో కోహ్లీకి ఐసీసీ స్ఫూర్తిదాయక క్రికెటర్ పురస్కారం ఇచ్చింది.
తలపై కోహ్లీ ముఖ చిత్రం.. వీరాభిమాని హెయిర్స్టైల్!!
ఐసీసీ అవార్డుకు ఎంపికైన కోహ్లీపై పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహమ్మద్ ఆమీర్ ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. అవార్డు గెలుచుకున్న తర్వాత కోహ్లీ మాట్లాడిన క్లిప్ను ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపైనే ఆమీర్ ప్రశంసలు కురిపించాడు. 'గ్రేట్ వర్డ్స్ బై గ్రేట్ ప్లేయర్' అని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. ఏ బౌలర్కైనా కోహ్లీ వికెట్ లభిస్తే గొప్ప బహుమతిగా భావిస్తారు' అని ఆమీర్ అన్నాడు. ఈ ట్వీట్పై ఆమీర్, కోహ్లీ అభిమానులు స్పందించారు. ఇద్దరు అత్యన్నత నైపుణ్యాలున్న క్రికెటర్లంటూ ట్వీట్లు చేస్తున్నారు.
2019 ప్రపంచకప్లో పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో కోహ్లీ, ఆమీర్ చివరిసారిగా తలపడ్డారు. పాకిస్తాన్తో ఆడిన ఆ మ్యాచ్లో భారత్ 89 పరుగులతో విజయం సాధించింది.కోహ్లీకి ఐసీసీ స్పిరిట్ క్రికెటర్ అవార్డును ప్రకటించడం పట్ల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ పురస్కారాలపై కోహ్లీ స్పందించాడు. సంవత్సరాలుగా తప్పులెన్నో చేసి అందరి దృష్టిలో పడ్డ తనకు స్ఫూర్తిదాయక క్రికెటర్ అవార్డు రావడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు.
A lovely moment in a special year of cricket.@imVkohli discusses the importance of playing cricket in the right way 👏 #ICCAwards pic.twitter.com/u3x44GFqQQ
— ICC (@ICC) 15 January 2020
'చాలా ఏళ్లు తప్పులెన్నో చేసి అందరి దృష్టిలో పడ్డా. ఇప్పుడు ఈ పురస్కారం రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇతరులపై క్రీడాకారులకు సోదరభావం ఉండాలి. వ్యక్తిగత పరిస్థితుల వల్లే ఆ ఘటన జరిగింది. దాని నుంచి బయటపడి వచ్చిన వ్యక్తిపై స్లెడ్జింగ్ చేసి ప్రయోజనం పొందాలని ప్రత్యర్థులు భావిస్తారు. అది ఫర్వాలేదు. కానీ.. అవహేళన చేయడం మాత్రం క్రీడాస్ఫూర్తిలో భాగం కాదు. దాన్ని నేను అంగీకరించను. మా అభిమానులు అలాచేయకూడదు. ఆ బాధ్యతనంతా మేమే తీసుకోవాలి. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకోవడం సరైందే. ఎవరో ఒకర్ని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని భావోద్వేగానికి గురిచేయడం మాత్రం తప్పు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.