ఇస్లామాబాద్: ఇంగ్లండ్ టూర్కి వెళ్లనున్న పాకిస్తాన్ జట్టులో స్టార్ పేసర్ మొహమ్మద్ అమీర్ తన స్థానాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. కరోనా వైరస్ అనంతరం క్రికెట్ పునరుద్దరణలో భాగంగా ఇంగ్లండ్-పాకిస్తాన్ క్రికెట్ జట్లు రెండు ఫార్మాట్లతో కూడిన ఓ సిరీస్ను నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారికి తగిన వైద్య సదుపాయాలను అందిస్తూ.. క్వారంటైన్లో ఉంచింది.
రెండో విడత పరీక్షల్లో కొందరికి నెగిటివ్ రావడంతో వారంతా ఇంగ్లండ్ చేరుకున్నారు. అయితే టీ20ల్లో పాల్గొనేందుకు ఫాస్ట్ బౌలర్ అమీర్ జులై 24న లాహోర్ నుంచి ఇంగ్లండ్కు బయలుదేరాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) నిబంధనల ప్రకారం 5 రోజులు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ 5 రోజుల్లో వైద్యులు అతడికి రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. రెండింటిలోనూ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అమీర్ కూడా త్వరలోనే ప్రాక్టీస్ ప్రారంభించనున్నాడు.
'మొహమ్మద్ అమీర్ జూలై 24 న లాహోర్ నుండి ఇంగ్లండ్ బయలుదేరాడు. యుకే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఐదు రోజుల పాటు అమీర్ ఐసోలేషన్లో ఉన్నాడు. ఈ సమయంలో వైద్యులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రెండింటిలోనూ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది' అని పీసీబీ తన వెబ్సైట్లో తెలిపింది. టెస్ట్ క్రికెట్ ఆడటం మానేసిన అమీర్.. ఆగస్టు 28 నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొంటాడు. అంతర్జాతీయ కెరీర్లో అమీర్ 36 టెస్టుల్లో, 61 వన్డేల్లో, 48 టీ20 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
17 ఏళ్ల వయసులో పాక్ జట్టులోకి టెస్టు అరంగేట్రం చేసిన అమీర్.. 30.47 యావరేజితో మొత్తం 119 వికెట్లు తీశాడు. అమీర్ పాక్ తరఫున మొత్తం 36 టెస్టులాడాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆమిర్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఫిక్సింగ్లో దోషిగా తేలడంతో అతడు 2010 నుంచి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. కొంతకాలం జైలు జీవితాన్ని కూడా గడిపాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మినహాయింపు ఇవ్వడంతో పాటు తిరిగి జాతీయ జట్టులో చోటు కల్పించింది.
ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. సిరీస్ మొత్తం మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే జరగనున్నాయి. మొదటి టెస్టు మాంచెస్టర్లో జరుగుతుంది. రెండో టెస్టు (ఆగస్టు 13-17), మూడో టెస్టు (ఆగస్టు 21-25)కు సౌతాంప్టన్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత రెండు జట్లు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి. తొలి మ్యాచ్ ఆగస్టు 28న జరుగుతుంది. టీ20లు అన్నీ సౌతాంప్టన్లో జరుగుతాయి.
సౌరవ్ గంగూలీ తొలి కోచ్ మృతి!!