లాహోర్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు ఇద్దరు పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్కి తాము దూరంగా ఉండాలని పేస్ బౌలర్ మహ్మద్ అమీర్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హరీస్ సోహైల్ నిర్ణయించుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం తెలిపింది. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరుగాల్సిన మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ కోసం పాక్ జట్టు ఇంగ్లండ్ వెళ్లాల్సి ఉంది.
'ఇంగ్లండ్ టూర్ నుంచి మహ్మద్ అమీర్, హరీస్ సొహైల్ తప్పుకున్నారు. ఆగస్టులో రెండో సంతానాన్ని పొందనున్న నేపథ్యంలో ఈ పర్యటన నుంచి ఆమిర్ తప్పుకున్నాడు. కుటుంబ కారణాల కారణంగా సోహైల్ దూరమయ్యాడు. అంతేకాని వేరే ఇతర కారణాలు ఏమీ లేవు. టెస్టులు, టీ20 సిరీస్ కోసం మొత్తం 24 మంది ఆటగాళ్లని ఎంపిక చేయనున్నాం. ఆటగాళ్లతో పాటు 14 మంది సిబ్బంది కూడా ఉంటారు' అని పీసీబీ తెలిపింది. ఈ పర్యటనకు జట్లను త్వరలోనే ప్రకటిస్తామని కూడా పీసీబీ చెప్పింది.
కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఇప్పటిప్పుడే జట్టుకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయబోమని పీసీబీ వెల్లడించింది. కాగా ఇంగ్లండ్కు పాక్ జట్టు జూలైలోనే వెళ్లి.. అక్కడే ప్రాక్టీస్ చేయాలని ఆలోచిస్తున్నది. వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి నుంచి ఆటగాళ్లు క్రికెట్కి దూరంగా ఉండటంతో.. లాహోర్లో ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్స్ని ఏర్పాటు చేయాలని పీసీబీ భావిస్తోంది. అందుకుగానూ అక్కడ నేషనల్ క్రికెట్ అకాడమీలో సౌకర్యాలను పరిశీలిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనకి జట్టు ఎంపిక తర్వాత అకాడమీలో ప్రాక్టీస్ చేయనుంది.
ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య సిరీస్ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. ఈ టూర్ కంటే ముందు.. ఇంగ్లండ్ గడ్డపై విండీస్ పర్యటించనుంది. ఇప్పటికే కరేబియన్ జట్టు అక్కడ అడుగుపెట్టింది. 14 రోజుల పాటు విండీస్ జట్టు క్వారంటైన్లో ఉండనుంది. జులై 8 నుంచి 12 వరకూ హోంప్షైర్లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. జులై 16 నుంచి 20 మధ్య రెండో టెస్టు, 24 నుంచి 28 వరకూ మూడో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనున్నాయి. వైరస్ భయంతో సిమ్రాన్ హిట్మెయర్, కీమో పాల్, డారెన్ బ్రావో ఈ పర్యటనకి దూరంగా ఉన్నారు.
'నీలా 150 మిలియన్ డాలర్ల సంపాదన ఉంటే.. టోర్నీని మేము వదిలేవాళ్లం'