వచ్చే ఏడాది భారత్లో జరగనున్న వన్డే ప్రపంచకప్కు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మ్యాచ్లు ఓడిపోవడం ఆశీర్వాదకరమేనని ఆల్రౌండర్ మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. మంగళవారం లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్.. ఇంగ్లాండ్ను దారుణంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు తొలి 10 ఓవర్లలోపే 26పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. 25ఓవర్లకే 110పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ లక్ష్యాన్ని కేవలం 18.4ఓవర్లలో ఛేదించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
ఇక ఈ ఓటమిపై మొయిన్ అలీ స్పందిస్తూ..'టెస్టు జట్టు రెగ్యులర్ ప్లేయర్లను తిరిగి వన్డే జట్టులో చూడడం ఆనందంగా ఉంది. ఈ ఓటమి మాకు మేలు చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రపంచకప్కు ఇంకా సంవత్సరం టైం ఉంది. మేము మా జట్టు లయను అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. ముందు కొన్ని ఓటములు ఎదురవుతాయి. ఓటములు మాకు మంచివే' అని మొయిన్ పేర్కొన్నాడు.
'గతంలో మేము చాలా గేమ్లను గెలిచాం. అయినా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మాకు ఓటములు కూడా అవసరమే. ప్రపంచకప్ లాంటి టోర్నమెంట్కు ముందు మాకు ఇలాంటి ఓటమి కచ్చితంగా మంచిదే. ఎందుకంటే గెలిచిన వాటికంటే ఓడిపోయిన మ్యాచ్ల నుండి మేం మరింత నేర్చుకునే వీలుంటుంది' అని మొయిన్ అభిప్రాయపడ్డాడు. 'ఇక నిన్నటి మ్యాచ్లో కొత్త బంతితో ఇండియా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. వారి బౌలింగ్ బాగుంది. ఇలాంటి కండీషన్లలో బ్యాటింగ్ చేయడానికి కావాల్సిన తర్ఫీదు మాకు అవసరం' అని మొయిన్ తెలిపాడు