చెన్నై: టెస్టు సిరీస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎలా ఔట్ చేయాలో తెలియడం లేదని ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. ఇప్పటికే చాలా కాలం ఎదురుచూశా కాబట్టి టెస్టుల్లో బరిలో దిగేందుకు ఆత్రుతతో ఉన్నానని చెప్పాడు. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయికి ఎక్కువ దూరంలో లేనని అలీ పేర్కొన్నాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. సుదీర్ఘ పర్యటనలో భారత్-ఇంగ్లండ్ జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లు ఆడనున్నాయి.
తాజాగా మొయిన్ అలీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడాడు. 'మేం విరాట్ కోహ్లీని ఎలా ఔట్ చేయాలి. అతనో అద్భుతమైన ఆటగాడు. ప్రపంచ స్థాయి క్రికెటర్. కోహ్లీ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడు. బిడ్డకు జన్మనివ్వనున్న తన భార్య అనుష్క శర్మ దగ్గర ఉండడం కోసం కంగారూ గడ్డపై జట్టు సాధించిన చారిత్రక విజయానికి దూరమైన కోహ్లీ.. మా జట్టుపై మరింతగా చెలరేగే ప్రమాదం ఉంది. ఎలాంటి బలహీనతలు లేని అతణ్ని ఎలా ఔట్ చేస్తామో తెలీడం లేదు. కానీ మాకు మంచి బౌలింగ్ దళం ఉంది' అని అలీ అన్నాడు.
'విరాట్ కోహ్లీ నాకో మంచి మిత్రుడు. మేం కలిసినపుడు ఎక్కువగా క్రికెట్ గురించి మాట్లాడుకోం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో కలిసి ఆడాం. మైదానంలో దూకుడుగా, జట్టు గెలుపు కోసమే తాపత్రయపడుతుంటాడు. డ్రెస్సింగ్ రూంలో సరదాగా ఉంటాడు. కరోనా నుంచి కోలుకున్న నేను మ్యాచ్లు గెలిపించే ప్రదర్శనలు చేయగలను. టీమిండియాతో జరగనున్న టెస్టుల్లో తుది జట్టుకు ఎంపికవుతానా? లేదా? అనేది వేరే విషయం. నేనెప్పుడూ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంటా' అని మొయిన్ అలీ తెలిపాడు.
'ఇప్పటికే చాలా కాలం ఎదురుచూశా కాబట్టి టెస్టుల్లో బరిలో దిగేందుకు ఆత్రుతతో ఉన్నా. ఇప్పటికీ పరుగులు చేసి, వికెట్లు తీసి మ్యాచ్లు గెలిపించే ప్రదర్శనలు చేయగలిగే సత్తా నాలో ఉందని నమ్ముతున్నా. స్వల్పకాల లక్ష్యాలను ముందుగా చేరుకోవాలి. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయికి ఎక్కువ దూరంలో లేను' అని ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. అలీ ఇంగ్లండ్ తరఫున 60 టెస్టుల్లో 181 వికెట్లు పడగొట్టాడు. 106 వన్డేల్లో 85, 34 టీ20ల్లో 17 వికెట్లు తీశాడు.
కూతురి ఫోటోను షేర్ చేసిన అనుష్క శర్మ.. పేరేంటో తెలుసా?