లండన్: ఒలింపిక్స్కు అనుబంధంగా ఉండేలా, అన్ని ప్రపంచ దేశాలనూ భాగం చేస్తూ, సరికొత్త క్రికెట్ గవర్నింగ్ బాడీ త్వరలో రానుందని, దానికి తన వద్ద బ్లూప్రింట్ సిద్ధంగా ఉందదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోడీ అన్నాడు.
కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోడీ సోమవారం ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడాడు.
అక్రమంగా డబ్బు తరలింపు, టెలివిజన్ ప్రసారాల హక్కుల విషయంలో అక్రమాలు తదితర కేసులను ఎదుర్కొంటున్న ఆయన, మరో క్రికెటింగ్ సిస్టమ్ రానుందని ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. దీన్ని జనరంజకంగా తయారు చేసేందుకు సంవత్సరాల తరబడి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపాడు.

అప్పట్లో ఈ ప్రాజెక్టు నుంచి తనను బలవంతంగా గెంటేశారని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు దీన్ని తయారు చేశానని చెప్పాడు. ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్న మోడీ, ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ క్రికెట్ రంగాన్ని ఇతర దేశాలకు దగ్గర చేయాలన్నదే తన అభిమతమని అన్నాడు.
ఆ ప్రాజెక్టుపై తిరిగి మనసు పెట్టానని, ఇది కార్యరూపం దాల్చేందుకు వేల కోట్ల రూపాయల డబ్బు అవసరమని, నగదు సమీకరణ పెద్ద కష్టం కాదని అంటున్నాడు. ఐసిసికి పోటీగా ఉండే ఈ కొత్త క్రికెట్ వ్యవస్థలో వన్డే పోటీలుండవని, ట్వంటీ20లు, టెస్టు మ్యాచ్లు మాత్రమే ఉంటాయని అన్నాడు.