ఇండోర్: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ అద్భుతమని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచులో ధోనీ అద్భుత ప్రదర్శనతోనే టీమిండియా విజయం సాధించిందని ప్రశంసలతో ముంచెత్తాడు భజ్జీ.
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ 1-1 సమంగా ఉంది. ఈ మ్యాచులో 92 పరుగులు చేసిన ధోనీ అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
'ధోనీ కెప్టెన్సీ అద్భుతం. ధోనీ మంచి వ్యూహం కారణంగానే ఈ మ్యాచులో గెలిచాం' అని హర్భజన సింగ్ తెలిపాడు. కాగా, ఈ మ్యాచులో హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ చెరో మూడు వికెట్లు తీశారు.

ఈ గెలుపు బౌలర్లదే: ధోనీ
తనపై వస్తున్న విమర్శలకు రెండో వన్డేలో ధోనీ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనీ.. మ్యాచ్ గెలుపు బౌలర్లదేనని చెప్పి తన నిరాడంబరతను చాటుకున్నాడు.
'మా స్పిన్నర్లు త్వర త్వరగా వికెట్లు తీయడం వల్లే దక్షిణాఫ్రికాను కట్టడి చేయగలిగాం. ఫాస్ట్ బౌలర్లు కూడా సరైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టడంతో మా విజయం తేలికైంది. ఈ విజయం సమష్టి కృషి' అని ధోనీ తెలిపాడు.
'బ్యాట్స్మెన్ కంటే ఈ మ్యాచ్ గెలుపులో బౌలర్లదే కీలక పాత్ర. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పరుగులు చేయడాన్ని కట్టడి చేస్తూనే.. క్రమంగా వికెట్లు పడగొట్టారు. 250 పరుగులు దక్షిణాఫ్రికాకు పెద్ద లక్ష్యమేమి కాదు, అయితే బౌలర్లు కట్టడి చేయడం వల్లే విజయం దక్కింది' అని ధోనీ పేర్కొన్నాడు.
'బ్యాటింగ్ విషయానికొస్తే టాప్ ఆర్డర్ త్వరగానే వికెట్లు కోల్పోయింది. అర్ధశతకం చేసిన తర్వాత రహనే కూడా ఔటయ్యాడు. దీంతో భారత బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి ఎక్కువైంది. బౌలర్లు ఎంతమేరకు రాణించగలరో చెప్పలేం. అందుకోసమే క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లు చేసేందుకే ప్రయత్నించా' అని ధోనీ తెలిపాడు.