ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో రాజస్థాన్ రాయల్స్పై ముంబై అద్భుతంమైన విజయం సాధించింది. టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్కు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124) అదిరిపోయే ఆరంభం అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు.. అయినా రాజస్థాన్ జట్టు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకి కష్టమే అని అంతా అనుకున్నారు. దానికితోడు సందీప్ శర్మ బౌలింగ్లో రోహిత్ శర్మ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు.

ఇలాంటి సమయంలో కామెరూన్ గ్రీన్ (44), సూర్యకుమార్ యాదవ్ (55) అద్భుతంగా ఆడారు. చివర్లో టిమ్ డేవిడ్ (45 నాటౌట్), తిలక్ వర్మ (29 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడుతూ ముంబైని విజయతీరాలకు చేర్చారు. ఈ విజయం అనంతరం ముంబై సారధి రోహిత్ శర్మ మాట్లాడాడు. 'ఇంత భారీ టార్గెట్ను ఛేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చివరి మ్యాచ్లో కూడా భారీ స్కోరు ఛేజ్ చేసే వరకు వచ్చి చివర్లో తడబడ్డాం' అని గుర్తుచేశాడు.
'ఈ మ్యాచ్లో అలాంటి పొరపాటు చేయకుండా గెలవడం సంతోషంగా ఉంది. పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. కానీ టిమ్ డేవిడ్కు ఆ సత్తా ఉంది. అలాంటి ఆటగాడు ఉండటం జట్టుకు చాలా యూజ్ అవుతుంది. జట్టులో మార్పులు చేయడం కష్టమైన పని. కానీ ఒక్కోసారి జట్టులో మార్పులు చేయకతప్పదు. ఇలాంటి వాటికి ఆటగాళ్లు ప్రిపేర్ అయ్యి ఉండటం మంచిది' అని చెప్పాడు.
'జోఫ్రాకు తీవ్రమైన గాయమైంది. అదే సమయంలో మ్యాచ్ ప్రాక్టీస్ కూడా సరిగా లేని బౌలర్లు మాత్రమే మా వద్ద ఉన్నారు. కానీ అతని పేస్ మాకు పెద్ద పాజిటివ్. సూర్య ఇలాంటి ఇన్నింగ్స్ ఆడతాడని ఊహిస్తూనే ఉన్నాం. ఇక జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతని ప్రదర్శన గతేడాదే చూశా. ఈసారి దాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందని తనను అడిగా. జిమ్కు వెళ్తున్నా అని చెప్పాడు. ఇది అతనికి, భారత్కు, ఆర్ఆర్కు అందరికీ మంచిదే' అని పేర్కొన్నాడు.