ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ అవుటైన తీరుపై కాంట్రవర్సీ చెలరేగింది. ఈ మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో రోహిత్ సేన సక్సెస్ అయింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
కానీ కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ అద్భుతంగా రాణించారు. దీంతో ముంబై ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది. అయితే రోహిత్ అవుటైన తీరుపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. సందీప్ శర్మ వేసిన స్లో నకుల్ బాల్ను ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే రోహిత్ బ్యాటును తప్పించుకున్న బంతి నేరుగా వెళ్లి సంజూ శాంసన్ చేతుల్లో పడింది.

సందీప్ బౌలింగ్లో సాధారణంగా వికెట్లకు దూరంగా నిలబడి కీపింగ్ చేసే సంజూ.. ఆ సమయంలో వికెట్ల పక్కనే కీపింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సందీప్ వేసిన డెలివరీని అందుకున్నాడు. అప్పుడు వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడ్డాయి. ఇది చూసిన అంపైర్ అవుటిచ్చాడు. రోహిత్ కూడా తను అవుట్ అయ్యానని అనుకొని పెవిలియన్ చేరాడు.
కానీ ఈ వికెట్కు సంబంధించిన వీడియో చూస్తే.. సందీప్ వేసిన బంతి వికెట్లను తాకినట్లు కనిపించడం లేదు. ఆ బంతి బెయిల్స్ను ముద్దాడిందా? లేదా అనేది పెద్ద కాంట్రవర్సీగా మారింది. సంజూ గ్లౌవ్స్ తాకడం వల్లనే బెయిల్స్ కింద పడ్డాయని కొందరు ప్యాన్స్ అంటున్నారు.
రోహిత్ బర్త్ డే రోజు జరిగిన ఈ మ్యాచ్లో అతను ఇలా అవుటవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ గ్లవ్స్ తగలడం వల్లనే బెయిల్స్ కింద పడినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటప్పుడు రోహిత్ను అవుట్గా ఎలా ప్రకటిస్తారని నిలదీస్తున్నారు. ఏదేమైనా బర్త్ డే రోజున బ్యాటుతో చెలరేగుతాడని అనుకున్న రోహిత్ ఇలా అవుటవడం మాత్రం ఫ్యాన్స్ను చాలా డిసప్పాయింట్ చేసింది.