ఐపీఎల్లో కీలకమైన సమరానికి రంగం సిద్ధమైంది. చెరో పది పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు రెడీ అయ్యాయి. ఈ రెండింట్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్కు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.
ఈ క్రమంలోనే వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్ గురించి ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ముంబైలో ఆడటం తమ టీంకు కూడా చాలా ఇష్టమని అతను చెప్పాడు. 'మాక్కూడా ముంబైలో ఆడటం చాలా ఇష్టం. మా ఆటతీరుకు ఈ మైదానం సరిగ్గా సరిపోతుంది. అలాగే ముంబై ఆటకు కూడా ఈ మైదానం బాగుంటుంది' అని చెప్పాడు.

'ఇలా రెండు టీమ్స్కు సరిపోయే మైదానంలో కాబట్టి.. ఇది కచ్చితంగా చాలా ఎగ్జయిటింగ్ మ్యాచ్ అవుతుంది. అలాగే మంచి కాంపిటీటివ్గా ఉంటుంది. ఈ సీజన్లో మేం మంచి క్రికెట్ ఆడాం. కాబట్టి ఈ మ్యాచ్ కోసం కూడా అందరం ఎదురు చూస్తున్నాం' అని కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్కు ముందు ముంబై మెంటార్ సచిన్ టెండూల్కర్ను కోహ్లీ కలిసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ ఆర్సీబీకి వరుసగా మూడో ఎవే గేమ్. లక్నోలో గెలిచిన ఆర్సీబీ.. ఢిల్లీలో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైతో మ్యాచ్ తాము కోల్పోయిన మొమెంటం తిరిగి పొందడానికి మంచి మార్గమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 'కొన్ని ఫలితాలు మేం అనుకున్నట్లు రాలేదు. మేం ఒక జట్టుగా ఏం చేయాలో ఈ ఓటముల నుంచి నేర్చుకున్నాం. ఇక్కడి నుంచి మరింత పట్టుదలగా ముందుకెళ్తాం' అని చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ హెడ్ కోచ్ మైక్ హెసాన్ కూడా ఈ స్టేడియం తమ ఆటతీరుకు చక్కగా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కూడా చిన్నస్వామిలాగే డిఫెండ్ చేసుకోవడం కష్టమని, గతేడాది పూర్తిగా ఇక్కడే ఆడామని గుర్తుచేసుకున్నాడు. అంతకుముందు కూడా ఇక్కడ కొంతకాలం గడిపామని, కాబట్టి ఈ పిచ్ గురించి అవగాహన ఉందని చెప్పాడు.