ఐపీఎల్లో అసలే సరైన బౌలింగ్ యూనిట్ లేక తంటాలు పడుతున్న ముంబై ఇండియన్స్కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయంతో సతమతం అవుతూ సరిగ్గా రాణించలేకపోతున్న జోఫ్రా ఆర్చర్ స్వదేశం వెళ్లిపోయాడు. అతన్ని తమ పర్యవేక్షణలో ఉంచాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.
గాయం కారణంగా గతేడాది ఐపీఎల్కు పూర్తిగా దూరమైన ఆర్చర్.. ఈ ఏడాది ముంబైకు బలంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సీజన్లో ఆర్చర్ కేవలం ఐదు మ్యాచులు మాత్రమే ఆడాడు. వీటిలో కూడా పెద్దగా రాణించలేదు. బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఆ తర్వాత అతను ఆడిన మ్యాచుల్లో కూడా అంత గొప్పగా ఆడలేదు. మధ్య మధ్యలో గాయంతో ఆడలేదు. ఈ క్రమంలోనే అతని స్థానంలో మరో ఇంగ్లిష్ ప్లేయర్ క్రిస్ జోర్డాన్ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ యాజమాన్యం వెల్లడించింది. ఈ సీజన్లో ఇక ఆర్చర్ ఆడటం లేదని, అందుకే అతని స్థానంలో జోర్డాన్ను రిప్లేస్మెంట్గా తీసుకున్నామని వెల్లడించింది.
ఈ వార్త విన్న ముంబై అభిమానులు చాలా బాధ పడ్డారు. ఆర్చర్ త్వరగా కోలుకొని మళ్లీ తన బౌలింగ్తో అదరగొట్టాలని కోరుకుంటున్నారు. అయితే మంగళవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో జోర్డాన్ ఆడతాడో? లేదో ఇంకా తెలియడం లేదు.
ఒక వేళ జోర్డాన్ కనుక ఆడితే ముంబై బౌలింగ్ ఎటాక్ కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ ఆరంభంలో ఆర్సీబీ, ఎంఐ జట్లు తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఘోరంగా ఓడిపోయింది. అయితే ప్రస్తుతం రోహిత్ మినహా దాదాపు ముంబై బ్యాటర్లు అందరూ మంచి ఫామ్లో ఉన్నారు.
దానికితోడు ఈ మ్యాచ్ వాంఖడే వేదికగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ తీసుకుంటే.. ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టాస్ కూడా ఈ మ్యాచ్లో కీలకమే.