ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు ముంబై ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. అయితే కొత్త కుర్రాళ్లు ప్రభ్సిమ్రాన్ సింగ్ (26), అథర్వ టైడే (29), హర్ప్రీత్ సింగ్ (41) చెలరేగారు. వీరికితోడు కెప్టెన్ శామ్ కర్రాన్ (55) కూడా అదరగొట్టాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లపై వీళ్లు ఎదురు దాడికి దిగారు. చివర్లో జితేశ్ శర్మ కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులతో అలరించాడు. దీంతో ఆ టీం 214 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబైకి కూడా మంచి ఆరంభం దక్కలేదు. ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ (1) భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. కానీ రోహిత్ శర్మ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్.. కేవలం రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయ సాధించింది. ఈ విజయం తనకు చాలా ప్రత్యేకం అని పంజాబ్ సారధి శామ్ కర్రాన్ చెప్పాడు.
ఈ మైదానంలో వివిధ జట్ల తరఫున ఎన్నో మ్యాచులు ఆడానని, ఈ గెలుపు సాధించింనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. బౌలింగ్తోపాటు బ్యాటింగ్లోనూ రాణించిన శామ్ కర్రాన్కే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 'మా పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అర్షదీప్, నాథన్ ఇద్దరూ సూపర్గా మ్యాచ్ను ముగించారు. ఈ అవార్డు నేను తీసుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తోంది' అని కర్రాన్ చెప్పాడు.
తను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు ఛాన్స్ తీసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు. ఇంతకుముందు మ్యాచుల్లో మరీ త్వరగా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించానని, అలాంటి పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. 'మా టీంలో చాలా పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉంది. జితేష్ ఎలా బ్యాంగ్-బ్యాంగ్ మోడ్లో ఆడాడో చూశాం కదా. అతను అలా ఆడగలడని మా అందరికీ తెలుసు' అని చెప్పుకొచ్చాడు.
'జట్టులో కొందరు ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకొని వచ్చే వరకు ఆ బాధ్యతలు మేమే నిర్వర్తించాలి. కెప్టెన్సీ విషయంలో మూడింట రెండు విజయాలు సాధించా. ఇక మళ్లీ శిఖర్ దగ్గరకు వెళ్లిపోవచ్చు' అన్నాడు. ఇదొక గొప్ప అనుభూతని కోచ్లు, లోకల్ కుర్రాళ్లు తనకు చాలా సాయం చేస్తున్నారని వివరించాడు. బేలిస్, హడిన్ తదితరులు అందరూ కలిసి జట్టులో మంచి రిలాక్స్డ్ వాతావరణం సృష్టించారని చెప్పాడు.