ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో టిమ్ డేవిడ్ (25 నాటౌట్), తిలక్ వర్మ (3) క్రీజులో ఉన్నారు. దీంతో ముంబైకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్లే కనిపించాయి. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.
తొలి బంతికి టిమ్ డేవిడ్ సింగిల్ తీశాడు. మరుసటి బంతి డాట్ బాల్. ఆ తర్వాతి బంతికి అద్భుతమైన యార్కర్ వేసిన అర్షదీప్.. మిడిల్ స్టంప్ను విరగ్గొట్టాడు. మరుసటి బంతికే వధీరా (0)ను కూడా సేమ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. అప్పుడు కూడా మిడిల్ స్టంప్ విరిగిపోయింది. దీంతో చివరి ముంబైకి రెండు బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు జోఫ్రా ఆర్చర్కు మరో డాట్ బాల్ వేశాడు అర్షదీప్.

చివరి బంతికి కేవలం సింగిల్ వచ్చింది. దీంతో ముంబై జట్టు 201 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఇలా చివరి ఓవర్ను అర్షదీప్ సింగ్కు ఇవ్వడం వల్ల నిర్వాహకులకు 60 లక్షలు నష్టం వాటిల్లింది. ఎందుకంటే అతను ఈ ఓవర్లో రెండు వికెట్లు తీయగా.. ఇద్దరు బ్యాటర్లూ యార్కర్లు ఆడలేక పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో రెండు సార్లు మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది.
ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే కాదు.. క్రికెట్లో వాడే జింగ్ బెయిల్స్ వికెట్లు వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ వికెట్లు చాలా ఖరీదైనవి. ఒక్కో వికెట్ సెట్ ఖరీదు 40 వేల డాలర్లు అంటే.. రూ.30 లక్షలపైగా ధర పలుకుతుంది. ఈ లెక్కన ఒక్కో వికెట్ రేటు రూ.10 లక్షలు అన్నమాట. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో అర్షదీప్ రెండు వికెట్లు విరగ్గొట్టాడు.
అంటే అతనికి ఈ ఓవర్ ఇచ్చినందుకు బీసీసీఐకి తక్కువలో తక్కువ రూ.20 లక్షలు నష్టం వచ్చినట్లే కదా. అదే కనుక ఈ రెండు వికెట్ సెట్లు మార్చేయాల్సి వస్తే రూ.60 లక్షలు నష్టం వచ్చినట్లే. అంతేకాదు, మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విరిగిన వికెట్లను అర్షదీప్కే ఇచ్చి పంపేశారు. దీని గురించి ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా జోకులు వేసుకుంటున్నారు.