ముంబైతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్లు అదరగొట్టారు. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఓపెనర్గా వచ్చిన మాథ్యూ షార్ట్ (11) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు.
అలాంటి సమయంలో కొత్త కుర్రాళ్లు ప్రభ్సిమ్రాన్ సింగ్ (26), అథర్వ టైడే (29) చెలరేగారు. పవర్ప్లేలో అద్భుతంగా ఆడారు. కానీ వీళ్లిద్దరూ అవుటైన తర్వాత లివింగ్స్టోన్ (10) కూడా విఫలమయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 83 పరుగులతో నిలిచింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ శామ్ కర్రాన్ (55), హర్ప్రీత్ సింగ్ (41) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబెట్టారు.

వీళ్లిద్దరూ 14 ఓవర్ల వరకు ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆ జట్టు 14 ఓవర్లకు 105/4 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత హర్ప్రీత్, కర్రాన్ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హర్ప్రీత్ అవుటైన తర్వాత వచ్చిన జితేశ్ శర్మ (7 బంతుల్లో 25) తను ఎదుర్కొన్న తొలి రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఈ ముగ్గురూ చివరి ఆరు ఓవర్లలో 109 పరుగులు పిండుకున్నారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి ఏకంగా 214 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలోనే పంజాబ్ బ్యాటర్లు 96 పరుగులు చేయడం గమనార్హం. ముంబై బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా (2/15) మాత్రమే రాణించాడు. మిగతా బౌలర్లలో కామెరూన్ గ్రీన్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. అర్జున్ టెండూల్కర్, జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెండాఫ్ కూడా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ వీళ్లంతా కూడా భారీగా పరుగులు కూడా ఇచ్చారు.