పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ చివరి ఓవర్లో తడబడింది. దీంతో ఈ మ్యాచ్లో ఆ టీం ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. అయితే కొత్త కుర్రాళ్లు ప్రభ్సిమ్రాన్ సింగ్ (26), అథర్వ టైడే (29), హర్ప్రీత్ సింగ్ (41) చెలరేగారు. వీరికితోడు కెప్టెన్ శామ్ కర్రాన్ (55) కూడా అదరగొట్టాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లపై వీళ్లు ఎదురు దాడికి దిగారు. చివర్లో జితేశ్ శర్మ కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులతో అలరించాడు. దీంతో ఆ టీం 214 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ముంబై కేవలం ఒక్కసారే 200+ స్కోరును ఛేజ్ చేసింది. దీంతో ఈ మ్యాచ్లో ముంబై గెలవడం అసాధ్యమని ఫ్యాన్స్ అనుకున్నారు. అలాంటి సమయంలో లక్ష్య ఛేదనలో ముంబైకి కూడా మంచి ఆరంభం దక్కలేదు.

ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ (1) భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై ఓటమి తప్పదని చాలా మంది డిసైడ్ అయ్యారు. కానీ రోహిత్ శర్మ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో 360 డిగ్రీస్ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. కానీ 18వ ఓవర్లో అర్షదీప్ బౌలింగ్లో అతను అవుటయ్యాడు.
చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో టిమ్ డేవిడ్ (25 నాటౌట్), తిలక్ వర్మ (3) క్రీజులో ఉన్నారు. దీంతో ముంబైకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్లే కనిపించాయి. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తొలి బంతికి టిమ్ డేవిడ్ సింగిల్ తీశాడు. మరుసటి బంతి డాట్ బాల్. ఆ తర్వాతి బంతికి అద్భుతమైన యార్కర్ వేసిన అర్షదీప్.. మిడిల్ స్టంప్ను విరగ్గొట్టాడు.
మరుసటి బంతికే వధీరా (0)ను కూడా సేమ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. అప్పుడు కూడా మిడిల్ స్టంప్ విరిగిపోయింది. దీంతో చివరి ముంబైకి రెండు బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు జోఫ్రా ఆర్చర్కు మరో డాట్ బాల్ వేశాడు అర్షదీప్. చివరి బంతికి కేవలం సింగిల్ వచ్చింది. దీంతో ముంబై జట్టు 201 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.