ఐపీఎల్ ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్రౌండ్ షోతో రెచ్చిపోయిన ఈ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ను ఇంటికి పంపేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (11), ఇషాన్ కిషన్ (15) ఎక్కువ స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్ (41), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (26), వధీర (23) తలో చేయి వేయడంతో ముంబై ఒక మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నోను ముంబై అద్భుతంగా కట్టడి చేసింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఫీల్డింగ్ కూడా అదరగొట్టింది.

అలాగే యువ పేసర్ ఆకాష్ మధవాల్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో లక్నో జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో మార్కస్ స్టొయినిస్ (40) ఒక్కడే పోరాడాడు. మిగతా వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆ జట్టును తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ ఓడిపోయినప్పుడు కామెడీ మీమ్స్ షేర్ చేసిన నవీన్ను టార్గెట్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఇప్పుడు కర్మ అనుభవించక తప్పదు అంటూ వేదాంతాలు వల్లిస్తున్నారీ ఫ్యాన్స్. ఇలా ఎందుకంటే.. గుజరాత్తో తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ మ్యాచ్లో కోహ్లీ (101 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో ఆ టీం ఓడిపోయింది.
ఇలా ఆర్సీబీ ఓడిపోగానే ఒక యాంకర్ పగలబడి నవ్వుతున్న మీమ్ను ఇన్స్టాలో షేర్ చేశాడు నవీన్ ఉల్ హక్. అది జరిగిన రెండ్రోజుల్లో ఎలిమినేటర్లో ఆ టీం అంతా 101 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. అంటే చివరి మ్యాచ్లో కోహ్లీ చేసిన స్కోరును.. ఎలిమినేటర్లో లక్నో మొత్తం కలిపి చేసిందన్నమాట.
ఇదే విషయం గుర్తు చేస్తున్న ఫ్యాన్స్.. కోహ్లీతో అనవసరంగా పెట్టుకోకూడదని అంటున్నారు. అలా అనవసరంగా గొడవలు పడితే ఇలాగే జరుగుతుందని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు, ఎలిమినేటర్ జరుగుతున్న సమయంలో కూడా స్టేడియంలో 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ కేకలు వేసి లక్నో టీంను ఆటపట్టించారు. నవీన్తోపాటు గంభీర్కు కూడా చికాకు కల్పించారు.