ఐపీఎల్ ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్రౌండ్ షోతో రెచ్చిపోయిన ఈ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ను ఇంటికి పంపేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (11), ఇషాన్ కిషన్ (15) ఎక్కువ స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్ (41), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (26), వధీర (23) తలో చేయి వేయడంతో ముంబై ఒక మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నోను ముంబై అద్భుతంగా కట్టడి చేసింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఫీల్డింగ్ కూడా అదరగొట్టింది.

అలాగే యువ పేసర్ ఆకాష్ మధవాల్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో లక్నో జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై జట్టు ముందడుగు వేసింది. గురువారం జరిగే రెండో క్వాలిఫైయర్లో గుజరాత్ను ఢీకొట్టేందుకు ముంబై రెడీ అయింది. ఈ క్రమంలో తమ విజయంపై ముంబై జట్టు సారధి రోహిత్ స్పందించాడు.
'మేం చాలా కష్టపడ్డాం. కాబట్టి క్వాలిఫైయర్-2కు వెళ్తామనే అనుకున్నా. ఆకాష్ మధవాల్ గతేడాది కూడా జట్టుతో ఉన్నాడు. కానీ ఆడించడం కుదర్లేదు. అయితే అతను ఏం చేయగలడో మాకు తెలుసు. మాక్కూడు డెత్ ఓవర్లు వేయడానికి సరైన బౌలర్ కావాలి. తను ఏం చేయగలడో తెలియడంతో అతనిపై నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది' అని రోహిత్ చెప్పాడు.
'ఇక మా టీం స్కౌట్స్ గురించి అంటారా?.. వాళ్లు మా జట్టుకు సెలెక్ట్ చేసిన చాలా మంది ఇప్పుడు టీమిండియాకు కూడా ఆడుతున్నారు. కొత్త కుర్రాళ్లు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడం మా బాధ్యత. వాళ్లు దేశవాళీలు చాలా ఆడతారు. కానీ ఇది డిఫరెంట్ గేమ్. కాబట్టి వాళ్లు టెన్షన్ పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం' అని వివరించాడు.
ఇక ఈ మ్యాచ్లో ముంబై ఫీల్డింగ్ అదరగొట్టింది. దీని గురించి మాట్లాడుతూ.. 'ఒక టీంగా మేమంతా ఫీల్డింగ్ను తెగ ఎంజాయ్ చేశాం. ఇంకా మెరుగవ్వాలని అనుకుంటున్నాం. చెన్నైకి వచ్చేటప్పుడే ఒక్క ప్లేయర్ మమ్మల్ని గెలిపించలేడు అని మాకు బాగా తెలుసు' అని పేర్కొన్నాడు. రెండో క్వాలిఫైయర్లో గుజరాత్పై కూడా ముంబై గెలిస్తే.. ఫైనల్లో చెన్నైతో తలపడుతుంది.