ఈ ఐపీఎల్లో ఎవరూ మర్చిపోలేని ఘటనల్లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ ఒకటి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో లక్నో టీం గొడవ పడింది. ముఖ్యంగా ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్ చాలా దురుసుగా ప్రవర్తించాడు. అతన్ని వెనకేసుకొచ్చిన టీం మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ గొడవ సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సాధారణంగా ఐపీఎల్లో ఎవరైనా అద్భుతంగా ఆడితే వారిని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టడం కోహ్లీకి అలవాటు. ఈ గొడవ జరిగిన తర్వాత లక్నో ఆడిన మ్యాచులో కూడా అదే చేశాడు. ఈ మ్యాచ్లో వృద్ధిమాన్ సాహా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు.

వీళ్లిద్దర్నీ కోహ్లీ తన ఇన్స్టా స్టోరీలో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆర్సీబీ మ్యాచ్లో కోహ్లీ అవుటైనప్పుడు తను మామిడి పండ్లు తింటున్న ఫొటోను నవీన్ ఉల్ హక్ షేర్ చేశాడు. దీనికి 'స్వీట్ మ్యాంగోస్' అని ట్యాగ్ తగిలించాడు. దీంతో ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. అతన్ని తెగ ట్రోలింగ్ చేశారు.
ఇక అప్పటి నుంచి లక్నో మ్యాచ్ ఎక్కడ జరిగినా అతను కనిపించినప్పుడల్లా 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ ఏడిపించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ చేతిలో ఓడిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒక యాంకర్ పగలబడి నవ్వుతున్న వీడియోను నవీన్ షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్కు మరింత కోపం వచ్చింది.
ఇప్పుడు ఎలిమినేటర్లో ముంబై చేతిలో ఓడిన లక్నో ఇంటి దారి పట్టడంతో లక్నో సూపర్ జెయింట్స్ ట్విట్టర్పై ఫ్యాన్స్ దాడి మొదలు పెట్టారు. మామిడిపండ్లు అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో తమ మేలు కోసం 'మ్యాంగో, మ్యాంగోస్, స్వీట్, ఆమ్' అనే పదాలను, మామిడిపండు ఎమోజీని మ్యూట్ చేసినట్లు లక్నో ప్రకటించింది. ట్విట్టర్లో కూడా ఈ పదాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.