తొలిసారి ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న ఇండియన్ మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్.. తన కెప్టెన్సీతో కూడా మెప్పించాడు. ముంబైకి మరో విజయాన్ని అందించాడు. రోహిత్ గైర్హాజరీలో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై సారధ్య బాధ్యతలు సూర్య చేతికి అప్పగించారు. అతను అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో ముంబై ఘనవిజయం సాధించింది.
కానీ ఈ విజయానందం మాత్రం సూర్యకు పూర్తిగా దక్కలేదు. ఎందుకంటే ఈ విజయంతోపాటే అతనికి మరో నష్టం కూడా జరిగింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సరైన సమయానికి తమ ఓవర్లను ముగించడంలో సూర్య సక్సెస్ కాలేదు. దీంతో అతనికి రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఈ జట్టు ఇలా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడం ఇదే తొలిసారని, కాబట్టి మొదటి తప్పిదం కింద కేవలం రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది.

అదే సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాకు కూడా ఐపీఎల్ షాకిచ్చింది. ఈ మ్యాచ్లో 10 బంతులు ఎదుర్కొన్న రాణా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీకే చెందిన కుర్ర బౌలర్ హృతిక్ షోకీన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. వీళ్లిద్దరూ రంజీల్లో ఢిల్లీ జట్టుకే ఆడతారు. అయినా సరే తన కుర్రతనంతో హృతిక్ కొంత యాటిట్యూడ్ చూపించాడు. రాణాను అవుట్ చేసి అతనికి ప్రత్యేకంగా సెండాఫ్ ఇచ్చాడు.
ఇది చూసిన నితీష్ రాణాకు చిర్రెత్తుకొచ్చింది. హృతిక్తో వాగ్వాదానికి దిగిన అతను.. మైదానంలోనే పచ్చిబూతులు తిట్టేశాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు.. నితీష్ రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే హృతిక్ మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. వీళ్లిద్దరూ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే ఈ జరిమానా విధించామని ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు.