టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టాస్ వేసేటప్పుడు రోహిత్ రాలేదు. అతనికి కడుపులో బాగలేదని, అందుకే రాలేదని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అతని కెప్టెన్సీలో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
అంతకుముందు మ్యాచ్లో ఢిల్లీతో మ్యాచ్లో ఫామ్ అందుకున్న రోహిత్.. ఈ మ్యాచ్లో ఇలా తప్పుకోవడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. 'మరీ ఇంత ఎండలో ఎవడు ఆడతాడు? అనే కదా రోహిత్ రాలేదు' అంటూ నెటిజన్లు అతన్ని తెగ ట్రోలింగ్ చేశారు. వాంఖడేలో ఈ జరిగిన ఈ మ్యాచ్ మధ్యాహ్నం సమయంలో జరిగింది. అందుకే ఎండ తట్టుకోలేక రోహిత్ రాలేదని కొందరు నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఛేజింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ ఆడాడు.

ఒక పక్క ఇషాన్ కిషన్ రెచ్చిపోతుంటే.. రోహిత్ కూడా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే 13 బంతుల్లో 20 పరుగులు చేసిన తర్వాత ఉమేష్ యాదవ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ఇది చూసి కూడా కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఫీల్డింగ్ చేయడానికి ఎటూ రాలేదు. బ్యాటింగ్ అయినా సరిగా చేయాలి కదా' అని విమర్శల వర్షం కురిపించారు.
అయితే రోహిత్ గైర్హాజరీలో సూర్యకుమార్ చక్కగా కెప్టెన్సీ చేశాడు. తొలిసారి ముంబై పగ్గాలు అందుకున్న అతను.. చిన్నచిన్న పొరపాట్లు చేసినప్పటికీ వాటిని వెంటనే సరిదిద్దుకున్నాడు. ఈ క్రమంలోనే కేకేఆర్ను 185 పరుగులకు కట్టడి చేయగలిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ (30), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) అందరూ చెలరేగడంతో ఈ మ్యాచ్లో ముంబై సునాయాస విజయం సాధించిన సంగతి తెలిసిందే.