ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్కు వరుణుడి ముప్పు వాటిల్లింది. ఇక్కడ వర్షం భారీగా పడటంతో మైదానం చిత్తడిగా తయారైంది. దీంతో ఈ మ్యాచ్ ఆలస్యమైంది. ఈ క్రమంలో ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ కనుక రద్దయితే పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అదే కనుక జరిగి వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే.. ముంబైకి నిరాశ తప్పదు.
అహ్మదాబాద్లో వర్షం పడటంతో ఇక్కడ మ్యాచ్ జరగదేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే మ్యాచ్ సమయానికి వర్షం ఆగడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ మ్యాచ్ జరిగే సమయంలో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో మ్యాచ్ జరగదేమో అని అభిమానులు భయపడుతున్నారు.

వర్షం ఆగిపోయినా కూడా నరేంద్ర మోదీ స్టేడియంలో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉంది. దీంతో దాన్ని పొడిబార్చే పనుల్లో సిబ్బంది తలమునకలు అవుతున్నారు. అదే సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు వార్మప్ అవుతున్నారు. ఒక వేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం ముంబై ఫైనల్ రేస్ నుంచి తప్పుకుంటుంది.
లీగ్ దశలో మెరుగైన పాయింట్లు, నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా గుజరాత్ ఫైనల్ చేరుతుంది. అదే జరిగితే తొలి క్వాలిఫైయర్లో తలపడిన జట్లే ఫైనల్లో కూడా తలపడతాయి. కాకపోతే వేదిక మారుతుంది. మొదటి క్వాలిఫైయర్ చెన్నైలో జరగ్గా.. ఫైనల్ మాత్రం అహ్మదాబాద్లో జరుగుతుంది.
మళ్లీ వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే గుజరాత్కు కొంచెం కష్టమే అని చెప్పాలి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ చాలా కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. వర్షం వల్ల వీళ్లిద్దరూ బంతిని సరిగా స్పిన్ చేయలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని క్యాష్ చేసుకుంటే ముంబై ఈజీగా ఈ మ్యాచ్ గెలుస్తుందని నిపుణులు అంటున్నారు.