ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఫైనల్లో చెన్నైని ఢీకొట్టే జట్టు ఏదో తేలిపోవడానికి గంటల సమయం మాత్రమే మిగిలింది. ఈ స్థానం కోసం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మాజీ దిగ్గజం టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ముంబై టీంలో కీలకమైన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై ఎదురు దాడి చేయడం అతని స్పెషాల్టీ. అదే సమయంలో గుజరాత్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ తమ టీంను గెలిపిస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో వీళ్లిద్దర్నీ సూర్యకుమార్ ఎలా ఎదుర్కొంటాడని చూడాలి. టామ్ మూడీ కూడా ఇదే అన్నాడు.

'అఫ్ఘాన్ స్పిన్ ట్విన్స్ను సూర్య ఎలా ఎదుర్కుంటాడా? అని ఎదురు చూస్తున్నా. అతను ప్రస్తుతం బెస్ట్ టీ20 ప్లేయర్. అలాగే బెస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్, అతని శిష్యుడు ఇద్దరూ ఉన్నారు. ఈ చిన్న పోటీ చూడటానికి చాలా ఎగ్జయిటింగ్గా ఉంటుంది' అని మూడీ అన్నాడు. ఇప్పటి వరకు రషీద్ ఖాన్ను సూర్య తొమ్మిది సార్లు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో 47 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేశాడు.

ఈ క్రమంలోనే ముంబైని ఓడించాలంటే గుజరాత్ జట్టులో కొన్ని మార్పులు చేయలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. దాసున్ షనకను పక్కన పెట్టేసి జోష్ లిటిల్ను ఆడించాలని సలహా ఇచ్చాడు. చెపాక్లో కాబట్టి చివరి మ్యాచ్లో షనకను ఆడించారు. కానీ ఇప్పుడు మాత్రం లిటిల్నే జట్టులోకి తీసుకుంటారని అనుకుంటున్నట్లు తెలిపాడు. మరి హార్దిక్ ఏం చేస్తాడో చూడాలి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో చెన్నైతో తలపడుతుంది.