ముంబై ఇండియన్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్లో గుజరాత్ అదరగొట్టింది. అన్ని విభాగాల్లో చెలరేగింది. వరుసగా రెండో సారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలోనే ఆడిన తొలి రెండు సీజన్లలో ఐపీఎల్ ఫైనల్ చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఆరంభంలో పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం లభించింది. ఈ క్రమంలో గుజరాత్ నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించింది. వృద్ధిమాన్ సాహా (18) పెద్దగా రాణించలేదు. అయితే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (129) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అతనికి సాయి సుదర్శన్ (43) చక్కటి సహకారం అందించాడు. చివర్లో హార్దిక్ (23 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఈ మ్యాచ్లో 233 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్లో ముంబైకి ఆరంభం నుంచి కష్టాలే ఎదురయ్యాయి. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనే గాయపడిన ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయడానికి రాలేదు.
అతని స్థానంలో ఓపెనర్గా వచ్చిన నేహాల్ వధీర (4) పెద్దగా ఆకట్టుకోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (8) మరోసారి విఫలమయ్యాడు. అయితే మిడిలార్డర్లో తిలక్ వర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (61), కామెరూన్ గ్రీన్ (30) ఫర్వాలేదనిపించారు. తిలక్ ఆడుతున్నంత సేపు మ్యాచ్ ముంబై వైపు మొగ్గు చూపినట్లే అనిపించింది.
కానీ చివర్లో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అతను కేవలం 2.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంత ముంబై మళ్లీ కోలుకోలేకపోయింది. అతనితోపాటు రషీద్, షమీ రెండు వికెట్లతో రాణించగా.. జోష్ లిటిల్ ఒక వికెట్తో సత్తా చాటాడు.
ఇలా గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా అద్భుతంగా రాణించారు. మైదానంలో చిరుతల్లా కదులుతూ క్యాచులు అందుకున్నారు. దీంతో ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో గుజరాత్ ఏకంగా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్ చేరిన గుజరాత్.. మరోసారి చెన్నైతో తలపడేందుకు రెడీ అయింది.