భారత్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో ఎంఎస్ ధోనీ ఒకడు. టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్లు అందించిన ఈ కెప్టెన్ అంటే క్రికెట్ అభిమానులు అందరికీ ప్రాణమే. అందుకే తమకు అవకాశం దొరికిన ప్రతిసారీ అతనిపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఫ్యాన్స్ ట్రై చేస్తుంటారు. తాజాగా ముంబై, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగే సమయంలో కూడా స్టేడియంలోని అభిమానులు 'వీ వాంట్ ధోనీ' అంటూ నినాదాలు చేశారు. అలాగే ఈ స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ కూడా ధోనీని కలిసేందుకు, తమ అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ స్టాఫ్కు చెందిన ఒక ఉద్యోగి నేరుగా వచ్చి ధోనీ పాదాలు తాకాడు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సింగ్ అరిజిత్ సింగ్.. ధోనీని కలవగానే సంతోషంతో అతని పాదాలు తాకాడు. ధోనీ అతన్ని లేపి కౌగిలించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు, ధోనీ ఆడుతున్న రోజుల్లో కూడా చాలా మంది అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చి మరీ ధోనీ పాదాలు తాకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్.. ఆటగాడిగా ధోనీకి చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి అతను ఐపీఎల్లో ఆడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చెన్నై ఏ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నా.. అభిమానులు ధోనీ ఆట చూసేందుకు ఇష్టపడుతున్నారు. అతను మైదానంలోకి రావాలని డిమాండ్లు చేస్తున్నారు. వాంఖడేలో కూడా అదే జరిగింది.