ఐపీఎల్లో గతేడాది నుంచి ముంబై ఇండియన్స్ ప్రయాణం ఏమంత గొప్పగా లేదు. గత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై.. ఈ ఏడాది సీజన్ను కూడా వరుస ఓటములతో ప్రారంభించింది. మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఘోరపరాజయం చవిచూసిన ముంబై జట్టు.. రెండో మ్యాచులో చెన్నై చేతిలో కూడా చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో కూడా విజయం సాధించలేకపోయింది.
వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకు శుభారంభమే దక్కింది. రోహిత్ శర్మ మరోసారి అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఇషాన్ కిషన్ కూడా ఫర్వాలేదనిపించాడు. కానీ సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ వంటి బడా ప్లేయర్లు మళ్లీ ఫెయిలయ్యారు. దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్య ఛేదనలో చెన్నైకి కూడా ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది.

ఫామ్లో ఉన్న ఓపెనర్ డెవాన్ కాన్వే స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై పైచేయి సాధించిందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో చెన్నై విజయం సులభమైంది. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇది ఈ ఐపీఎల్లో ముంబైకి వరుసగా రెండో ఓటమి. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైకి బౌలింగ్ బలహీనత అని అంతా అనుకున్నారు. కానీ వాళ్ల బ్యాటింగ్ వైఫల్యం వల్లనే వరుసగా రెండు మ్యాచులు ఓడింది. ఇలా చెన్నై చేతిలో సొంత మైదానంలో ముంబై ఓడిపోవడంతో రోహిత్ శర్మ చాలా అవమానం ఫీలైనట్లు ఉన్నాడు. అందుకే మ్యాచ్ ఓడిపోగానే తన మొఖం ఎవరికీ కనిపించకుండా క్యాప్తో కవర్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.