ఐపీఎల్ హేమాహేమీల పోరులో విజయం చెన్నైనే వరించింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో చివరకు చెన్నై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ముంబైను చెన్నై స్పిన్నర్లు అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నైకి ఎవరూ ఊహించని విధ్వంసకర ఓపెనింగ్ లభించింది.
చెన్నై తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న అజింక్య రహానే (27 బంతుల్లో 61) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో 18.1 ఓవర్లలోనే చెన్నై ఈ మ్యాచ్ను ముగించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ధోనీ.. తమ బౌలర్లను మెచ్చుకున్నాడు. 'దీపక్ చాహర్ ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. ఇక సిసాండ మగాలకు ఇది మొదటి గేమ్. దీంతో బౌలర్లను మార్చడంలో కొంత సమస్య వచ్చింది' అని వెల్లడించాడు.

అయితే తమ స్పిన్నర్లు మాత్రం అద్భుతంగా ఆడారని ధోనీ మెచ్చుకున్నాడు. పవర్ప్లే తర్వాత పిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్ద సహకారం దక్కలేదని, కానీ స్పిన్నర్లు ఆ పరిస్థితిని కూడా చక్కగా వాడుకున్నారని అన్నాడు. ఆ తర్వాత మగాల, ప్రిటోరియస్ కూడా అద్భుతంగ బౌలింగ్ చేశారని కొనియాడాడు. ఇక యువ పేసర్ తుషార్ దేశ్పాండే ఇంకా నేర్చుకుంటున్నాడని, రోహిత్ను అతను అవుట్ చేసిన బంతి సూపర్ డెలివరీ అని చెప్పాడు.
ఇక ఛేజింగ్లో విధ్వంసం సృష్టించిన అజింక్య రహానే ఎలాంటి బ్యాటరో తనకు తెలుసునని, అందుకే తన నుంచి ఏం ఆశిస్తున్నానో స్పష్టంగా చెప్పానని ధోనీ వెల్లడించాడు. అతను ఆడిన విధానం తనకు బాగా నచ్చిందన్నాడు. రహానే భారీ సిక్సర్లు కొట్టలేడని, కానీ టెక్నికల్గా టాప్ అనే విషయం తనకు తెలుసునని అన్నాడు. అలాగే ఎవే గేమ్స్ గెలవడి, నాకౌట్స్ చేరడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం అని చెప్పాడు.