చెన్నైతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడింది. చెపాక్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ విజయం ముంబైనే వరించింది. ఈ జింక్స్ను బద్దలు కొట్టిన చెన్నై.. ఈ మ్యాచ్లో ఈజీ విక్టరీ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది.
మిడిల్ ఓవర్లలో నేహాల్ వధీర (64), సూర్యకుమార్ యాదవ్ (26), ట్రిస్టియన్ స్టబ్స్ (20) ఫర్వాలేదనిపించారు. కానీ ఎవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో ఆ టీం కేవలం 139 పరుగులే చేయగలిగింది. డెవాన్ కాన్వే (44), రుతురాజ్ గైక్వాడ్ (30), శివమ్ దూబే (26 నాటౌట్) రాణించడంతో చెన్నై ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ ఓటమి అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు.

తమ టీం ఏ విషయంలోనూ రాణించలేదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. 'మా బ్యాటర్లు సరిపోయే స్కోరు చేయలేదు. మొత్తం బ్యాటింగ్ యూనిట్గా ఈ రోజు విఫలమయ్యాం. మంచి స్కోరు చేసి ఉంటే పోరాడే అవకాశం ఉండేది. బౌలింగ్లో కూడా పీయూష్ చావ్లా ఒక్కడే రాణిస్తున్నాడు. మిగతా బౌలర్లు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకొని రాణించాల్సిన అవసరం ఉంది' అని చెప్పాడు.
ఈ మ్యాచ్లో రోహిత్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఓపెనర్గా తను రాకుండా కామెరూన్ గ్రీన్ను పంపించాడు. దీనిపై ప్రశ్నించగా.. 'మిడిల్ ఓవర్లలో ఒక భారత బ్యాటర్ ఉండాలని అనుకున్నాం. అసలే తిలక్ వర్మ లేకపోవడంతో నేనే మిడిల్ ఓవర్లలో రావాలని అనుకున్నా. కానీ ఏం లాభం? పవర్ప్లేలోనూ మూడు వికెట్లు కోల్పోయాం. దీంతో ఈ వ్యూహాలన్నీ వేస్ట్ అయిపోయాయి' అని అన్నాడు.
ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించాలని తాము ఆశిస్తామని, కానీ ఇది ఒక టీం స్పోర్ట్ కాబట్టి ఎవరు ఎప్పుడు ఆడతారో చెప్పలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. 'ఈ మ్యాచ్ నుంచి మేం చాలా నేర్చుకోవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తాం. ఈ సీజన్లో హోం అడ్వాంటేజ్ ఉన్నట్లు ఏం అనిపించడం లేదు. తర్వాతి రెండు మ్యాచులు హోం గ్రౌండ్లో అయినా సరే.. గెలవాలంటే మేం చాలా మంచి క్రికెట్ ఆడాల్సి ఉంది' అని రోహిత్ పేర్కొన్నాడు.